హైదరాబాద్: నేరం జరుగుతుంటే చూస్తూ ఉండిపోవడం కాదు.. ఆ నేరగాడిని పట్టుకోవడమే అసలైన పౌర ధర్మమని నిరూపించారు ఒక సామాన్య ఆటో డ్రైవర్. ఒక మహిళ మెడలోని బంగారు గొలుసును రౌడీ షీటర్ లాక్కేళ్లేందుకు ప్రయత్నిస్తే.. ప్రాణాలకు తెగించి, తన ఆటోనే ఆయుధంగా మలచుకొని సాహసోపేతంగా ఆటో డ్రైవర్ మహమ్మద్ జాహెర్.. రౌడీ షీటర్ను అడ్డుకున్నారు. కర్రతో దాడి చేస్తున్నా బెదరకుండా ప్రతిఘటించారు.
ఈ అసామాన్య ధైర్యాన్ని ప్రదర్శించిన ఆటో డ్రైవర్ జాహెర్ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ మంగళవారం బంజారాహిల్స్ లోని టీజీఐసీసీసీలోని తన ఛాంబర్ లో ప్రత్యేకంగా సన్మానించారు. మహమ్మద్ జాహెర్కు ప్రశంసా పత్రంతో పాటు నగదు పురస్కారాన్ని అందజేశారు.

బేగం బజార్ జిన్సీ చౌరాహా ప్రాంతంలో మార్చి 4వ తేదీ తెల్లవారుజామున మంజు ఓమ్లతా తన కోడలితో కలిసి మార్నింగ్ వాక్కు వెళ్లారు. హిందీ మర్వాడీ విద్యాలయ స్కూల్ వద్దకు చేరుకోగానే, డబీర్పురకు చెందిన రౌడీ షీటర్ మహ్మద్ సోహేల్ ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. ఆ క్రమంలో నిందితుడి స్కూటీ అదుపుతప్పి కిందపడిపోయింది. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో, అదే సమయంలో అటుగా వెళ్తున్న ఆటో డ్రైవర్ మహమ్మద్ జాహెర్ ఈ దృశ్యాన్ని సైడ్ వ్యూ మిర్రర్ ద్వారా గమనించారు.
జాహెర్ వెంటనే స్పందించి తన ఆటోను వేగంగా వెనక్కి తిప్పారు. పారిపోవడానికి ప్రయత్నిస్తున్న రౌడీ షీటర్ బైక్ను తన ఆటోతో ఢీకొట్టి అతడిని కిందపడేశారు. ఆ సమయంలో నిందితుడు కర్రతో దాడి చేసినా భయపడకుండా ప్రతిఘటించి అడ్డుకున్నారు. ఆ సమయంలో పారిపోతుండగా వెంటనే గస్తీ తిరుగుతున్న పోలీసులు రౌడీ షీటర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత జాహెర్ ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా అక్కడి నుండి వెళ్లిపోయారు. ఆటో డ్రైవర్ సాహసం గురించి గోషామహల్ పోలీసులకు బాధితురాలు తెలియజేశారు.
కాగా, ఈ వీరోచిత దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. రౌడీ షీటర్ను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించి, నిస్వార్థంగా వెళ్లిపోయిన ఆ అజ్ఞాత వీరుడి కోసం గోషామహల్ పోలీసులు గాలింపు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీలో ఆటో నంబర్ను చూసి, సాంకేతిక పరిజ్ఞానంతో జాహెర్ను గుర్తించారు.
ఈ సందర్భంగా సీపీ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్ మహమ్మద్ జాహెర్ చూపిన సాహసం సమాజానికి ఆదర్శమన్నారు. “కళ్లముందే నేరాలు జరుగుతున్నా పట్టించుకోని ఈ రోజుల్లో, ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న జాహెర్ సమాజానికి నిజమైన రోల్ మోడల్. ఆయనలో ఒక అద్భుతమైన ప్రజా పోలీస్ ఉన్నారు. ఎలాంటి ప్రతిఫలం కూడా ఆశించలేదు. ఇలాంటి బాధ్యతాయుతమైన పౌరులు ఉన్నప్పుడే నేరస్తులకు భయం పుడుతుంది" అని ప్రశంసించారు.
నేరం జరుగుతున్నప్పుడు భయపడకుండా, మహమ్మద్ జాహెర్లా ధైర్యంగా స్పందించి వెంటనే డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని నగరవాసులకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కాగా, డబిర్ పూరకు చెందిన రౌడీ షీటర్ పై గోషా మహల్ పీఎస్లో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అతడిపై పలు పోలీస్ స్టేషన్లలో 16 కేసులున్నాయి.
✅ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్
✅ఆటోతో ఢీకొట్టి ‘నిలువరించిన’ తీరు.. సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం
✅సన్మానించిన నగర సీపీ సజ్జనర్.. నగదు పురస్కారం, ప్రశంసా పత్రం అందజేత
నేరం జరుగుతుంటే చూస్తూ ఉండిపోవడం కాదు.. ఆ నేరగాడిని పట్టుకోవడమే అసలైన పౌర ధర్మమని… pic.twitter.com/IyGunUWQyB— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) May 5, 2026


