వేలూరు: పోలింగ్ కేంద్రాల్లో పార్టీలకు అతీతంగా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీ శివరామన్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలు ఈనెల 23న జరగనున్న నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బందోబస్తు ఏర్పాట్లపై పోలీసులకు సలహాలు, సూచలను ఇచ్చారు. ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల రోజున ఓటర్లు ఎటువంటి ఇబ్బందులు పడకుండా వారి ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునే విధంగా ఎన్నికల సంఘం ప్రయత్నాలు చేస్తుందని అందులో భాగంగా పోలింగ్ కేంద్రాల్లో పోలీస్ బందోబస్తుపై ఇప్పటికే అధికారులతో సమీక్షించామన్నారు. ఇప్పటికే జిల్లాలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామన్నారు. సీసీ కెమెరాలో నమోదు చేసే విధంగా వాటిని ఆన్లైన్ ద్వారా జిల్లా కేంద్రం నుంచి పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. వేలూరు జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజక వర్గాల్లో మొత్తం 1,427 పోలింగ్ కేంద్రాలున్నాయని, వీటిలో 149 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించామని చెప్పారు. ఎన్నికల రోజున పోలీసులు వ్యవహరించాల్సిన తీరు, చేయాల్సిన పనులపై ఇప్పటికే శిక్షణ ఇచ్చామన్నారు. అదనపు పోలీస్ సూపరింటెండెంట్ పళని, అన్నాదురై, ఎన్నికల విభాగం సీఐ రజనీ, పోలీసులు పాల్గొన్నారు.


