సాక్షి, చైన్నె : తిరునల్వేలి(నెల్లై) నియోజకవర్గం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై తప్పుకున్నారు. ఈ నియోజకవర్గాన్ని తాను ఎందుకు వదులు కోవాల్సి వచ్చిందో అనే వివరాలను ఆయన మంగళవారం ప్రకటించారు. నైనార్ నాగేంద్రన్ అంటే తిరునల్వేలి, తిరునల్వేలి అంటే నైనార్. ఇది అక్కడి రాజకీయం. అన్నాడీఎంకేలో ఆయన చక్రం తిప్పినానంతరం, బీజేపీలో చేరి రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడయ్యారు. అన్నాడీఎంకే తరఫున ఇక్కడ పోటీ చేస్తూ వచ్చిన నైనార్, చివరకు గత ఎన్నికలలో బీజేపీ తరఫున పోటీ చేసి అసెంబ్లీకి వెళ్లారు. ఈ పరిస్థితులలో తిరునల్వేలికి ఎన్నికల ప్రచారం నిమిత్తం వచ్చిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామితో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఆయన్ను మీడియా కదలించగా ఈసారి తిరునల్వేలిని వదులుకుని సాత్తూరు నుంచి పోటీ చేయడంపై స్పందించారు.
స్థాన చలనం
మిత్రపక్షం అన్నాడీఎంకే కోరిక మేరకు తాను నెల్లైకు బదులుగా సాత్తూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అభ్యర్థుల జాబితా అధికారికంగా వెలువడిన వెంటనే సాత్తూరులో నామినేషన్ వేస్తానని తెలిపారు. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా ప్రజాసేవ కొనసాగుతుందన్నారు. నెల్లై ప్రజలకు తాను ఎప్పటికీ ముద్దుబిడ్డనే అని వ్యాఖ్యలు చేశారు. ఇక, డీఎంకేపై విమర్శలు గుప్పిస్తూ, డీఎంకే ప్రభుత్వంపై తాము ఈరోజు సాయంత్రం చార్జ్ షీట్ దాఖలు చేయబోతున్నట్లు ఆయన ప్రకటించారు. డీఎంకే ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని మండిపడ్డారు. గత ఎన్నికల్లో డీఎంకే మేనిఫెస్టో హీరోలా ఉంటే, ప్రస్తుత మేనిఫెస్టో జీరోలా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీకి డీఎంకే నేత ఒకరు ప్రాణహాని తలపెట్టేలా వ్యాఖ్యలు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు సీఎం స్టాలిన్ దీపావళికి శుభాకాంక్షలు చెప్పరు అని పేర్కొంటూ, అయితే క్రిస్మస్ పండుగకు మాత్రం చెబుతారని విమర్శించారు. బీజేపీ అన్ని మతాల పండుగలకు (ముస్లిం, క్రిస్టియన్ పండుగలతో సహా) శుభాకాంక్షలు తెలుపుతుందన్నారు. డీఎంకే కేవలం ఓట్ల కోసమే లౌకికవాదం మాట్లాడుతోందన్నారు. బీజేపీ అభ్యర్థులందరూ ఏప్రిల్ 4న నామినేషన్లు దాఖలు చేస్తారని ఆయన అన్నారు.


