శ్రమ, ప్రతిభకు గుర్తింపే.. డిగ్రీపట్టా
సాక్షి, చైన్నె: ‘డిగ్రీపట్టా అనేది కేవలం ఒక కాగిత ముక్క మాత్రం కాదు..మీ శ్రమకు ఫలితం. మీ జ్ఞానానికి మీ ప్రతిభకు గుర్తింపు. ఇది కుటుంబంలోని అనేక తరాల కల...దీనిని సాకారం చేసుకోవడం వెల కట్టలేని ఆనందకర క్షణం’ అని విద్యార్థులను ఉద్దేశించి సీఎం ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించారు. తిరుచ్చిలోని భారతీ దాసన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ (బీఐఎం) 33వ గ్రాడ్యుయేషన్ సోమవారం చైన్నెలో జరిగింది. మ్యూజిక్ అకాడమి వేదికగా జరిగిన ఈ వేడుకకు సీఎం ఎంకే స్టాలిన్ హాజరయ్యారు. 197 మందికి డిగ్రీలు, పతకాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి శంకర్, భారతీ దాసన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ చైర్మన్ రవి అప్పాస్వామి, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు బాల భాస్కర్, పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ఎస్. జయకృష్ణ, పోసు్ట్రగాడ్యుయేట్ విభాగాధిపతి రాఘవేంద్ర, భారతీదాసన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ నిర్వాహకులు తదితరులు హాజరయ్యారు.
జీవితం ఉజ్వలమయం..
ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి సీఎం ఎంకేస్టాలిన్ మాట్లాడుతూ ఇక్కడ పట్టభద్రులైన విద్యార్థులకు ఈ రోజు చాలా ముఖ్యమైనదని పేర్కొంటూ, ఈ జీవిత ప్రయాణంలో చేతిలో ఉన్న ’డిగ్రీ’ కేవలం కాగితం ముక్క కాదని, శ్రమకు ఫలితం, జ్ఞానం, ప్రతిభకు గుర్తింపు అని వ్యాఖ్యలు చేశారు. విద్యారంగంలో జాతీయ స్థాయిలో ప్రత్యేక స్థానాన్ని బీఐఎం కలిగి ఉన్నట్టు వివరించారు. ఇక్కడ చదువుకున్న వారెందరో విద్య, వ్యాపారం, సామాజిక రంగాలలో ఉన్నత స్థానాలలో ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ జాబితాలో ఇక్కడున్న విద్యార్థులు సైతం ఉండాలని ఆకాంక్షించారు. దేశంలోనే ఉన్నత విద్యకు ఉత్తమ రాష్ట్రంగా తమిళనాడు అవతరించి ఉందన్నారు. ఉన్నత విద్యా పరంగా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్లో అత్యుత్తమ విద్యా సంస్థలు ఇక్కడ ఉన్నాయని వివరించారు. ఉన్నత విద్య కోసం అనేక కార్యక్రమాలు ప్రభుత్వం నిర్వహిస్తూ వస్తున్నట్టు గుర్తు చేస్తూ, ట్యూషన్ ఫీజు రాయితీలు, కొత్త విశ్వవిద్యాలయాల ఏర్పాటు, పేద, సామాన్య విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను దరి చేర్చడమే కాకుండా, ప్రభుత్వం అమలు చేస్తున్న అల్పాహార పథకం, పుదుమైపెన్, తమిళ్ పుదల్వన్,నాన్ మొదల్వన్ పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా మహాకవి తిరువళ్లువర్ రచించిన తిరుక్కురల్లోని అనేక సూక్తులను విశదీకరించారు. ఇందులోని జీవిత పాఠాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని, మరిచి పోకూడదని, ఏ కష్ట సమయంలో నైనా, నిజాయితీ, నమ్మకం, బాధ్యత వంటి విలువలు అనుసరించాలనిపిలుపునిచ్చారు.


