
కొత్త ఉద్యోగులకు రూ.15 వేలు ప్రోత్సాహం
– పీఎఫ్ జోన్ కమిషనర్ దేబీ ప్రసాద్ భట్టాచార్య
కొరుక్కుపేట: కొత్త ఉద్యోగులకు రూ.15వేలు ప్రోత్సాహం అందిస్తున్నట్టు చైన్నె నార్త్ జోన్ ప్రాడిడెంట్ ఫండ్ కమీషనర్ దేబీ ప్రసాద్ భట్టాచార్య ప్రకటించారు . దీనిని సంబంధించి ఒక ప్రకటనలో పేర్కొంటూ.. కేంద్రమంత్రివర్గం ఇటీవల ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని ఆమోదించిందని.. దీని ద్వారా 3.5 కోట్లమంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రూ.99.45 కోట్లు కేటాయించింది. ఈ పథకం ఆగస్టు 1 నుంచి జూలై 31, 2027 వరకు సృష్టించబడిన ఉపాధి అవకాశాలకు వర్తిస్తుందన్నారు. ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్లో నమోదు చేసుకున్న ఉద్యోగులకు రెండు విడతలుగా రూ.15 వేలు వరకు ప్రోత్సాహకం ఇస్తుందని వెల్లడించారు. ఈ మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తారన్నారు.
చైన్నెలో
11 స్క్వాయర్ ప్రారంభం
సాక్షి,చైన్నె : చైన్నె వళ్లువర్ కోట్టం హైరోడ్డులో విలేజ్ స్క్వాయర్ భవనంలో కొత్తగా 11 స్క్వాయర్ శాఖను ప్రారంభించినట్టు ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఈ మేరకు ప్రారంభో త్సవం సందర్భంగా లోగోను ఆవిష్కరించారు. ఈసందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ నగర వాసులను ఆహ్లాద పరిచేరీతిలో ఈ 11 స్క్వాయర్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇందులో పసందైన భోజనంతోపాటు క్యూరేటెడ్ సంగీతం , స్టైలిష్ వాతావరణంతో మిళితం చేసి కొత్త అనుభూతులను కల్పించనున్నామన్నారు. ప్రతీ వారం డిజే నైట్స్ తోపాటుగా ఎల్లప్పుడూ ఏదో ఒక కొత్తదనం కార్యక్రమాలను చేపట్టనున్నట్టు తెలిపారు . ప్రముఖ గాయనీ గాయకులను సైతం ఆహ్వానించి కార్యక్రమాలకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
తేని ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణి మృతి
– బంధువులు రోడ్డు దిగ్బంధం
అన్నానగర్: తేని జిల్లా పూదిప్పురం సమీపంలోని వాలైయతు పట్టి గ్రామానికి చెందిన కార్తీక్ భార్య గర్భిణి జయలక్ష్మి(23). ఆమెను జూలై 9వ తేదీన ప్రసవం కోసం తేని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చేర్చారు. ఆ తరువాత ఆమెకు చికిత్స అందించారు. జూలై 10న సిజేరియన్ ద్వారా మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే శస్త్రచికిత్స కారణంగా గర్భాశయం నుంచి రక్తస్రావం ఆగకపోవడంతో గర్భాశయాన్ని తొలగించినట్లు తెలుస్తుంది. ఈ స్థితిలో రక్తస్రావం కొనసాగుతోందని జయలక్ష్మి ప్రాణాలకు ప్రమాదం ఉందని పేర్కొంటూ, సరైన చికిత్సను అందించలాని డిమాండ్ చేస్తు శుక్రవారం సాయంత్రం తేని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రి ముందు జాతీయ రహదారిపై అనారోగ్యంతో ఉన్న మహిళ బంధువులు కూర్చుని రోడ్డును దిగ్బంధించారు. ఈ విషయం తెలుసుకున్న ఆండిపట్టి డీఎస్పీ శివసుప్పు నేతత్వంలోని పోలీసులు అక్కడికి చేరుకుని వారితో చర్చలు జరిపారు. రోడ్డు దిగ్బంధం కారణంగా దాదాపు అరగంట పాటు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో జయలక్ష్మి చికిత్స ఫలించక మృతి చెందింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా మెడికల్ కాలేజీ వద్ద పోలీసులను మోహరించి భద్రతా పనిలో నిమగ్నమై ఉన్నారు.
18 మంది బాలికలకు
లైంగిక వేధింపులు
– అనాథ శరణాలయం యజమాని సహా ముగ్గురి అరెస్ట్
తిరువొత్తియూరు: ఓ ఆశ్రయంలో 18 మంది బాలికలను లైంగికంగా వేధించారనే ఆరోపణలతో యజమాని సహా ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వివరాలు.. వండలూర్ సమీపంలోని ఉనమంచెరి ప్రాంతంలో ఓ ప్రైవేట్ అనాథ శరణాలయం నడుస్తోంది. ఈ అనాథ శరణాలయంలో 30 మందికి పైగా బాలికలు నివసిస్తున్నారు. వారందరూ ఒకే ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. ఈ క్రమంలో అనాథ శరణాలయంలోని బాలికలను లైంగికంగా వేధిస్తున్నట్టు చిన్నారులు భద్రత సంక్షేమ శాఖ అధికారులకు రహస్య సమాచారం అందించారు. దీంతో వండలూర్ మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. దీని ఆధారంగా, శరణాలయ యజమాని అరుల్ దాస్, షెల్టర్ సభ్యురాలు ప్రియ, శరణాలయ డ్రైవర్ పళనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, వారిని అరెస్టు చేశారు. బాలికలను లైంగికంగా వేధించిన విషయంపై వారి వద్ద దర్యాప్తు చేస్తున్నారు. ఈ శరణాలయం 15 సంవత్సరాలు గా నడుస్తోందని, పళని గత 3 నెలలకు ముందు పనిలో చేరి నట్లు తెలిసింది ఈ ఘటన ఉనమంజేరి ప్రాంతంలో సంచలనం సృష్టించింది.