
20 శాతం సీట్ల పెంపు
● ఆర్ట్స్ అండ్ సైన్స్కు మరింత అవకాశం ● ఇంజినీరింగ్ కౌన్సెలింగ్కు శ్రీకారం ● 7.5 శాతం కోటా సీట్ల భర్తీ
సాక్షి, చైన్నె: రాష్ట్రంలో ఆర్ట్స్ అండ్సైన్స్ కోర్సులకు పెరిగిన డిమాండ్ నేపథ్యంలో సీట్ల సంఖ్యను 20 శాతం పెంచుకునే విధంగా కళాశాలలకు రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఇంజినీరింగ్ కోర్సుల కౌన్సెలింగ్ సోమవారం ప్రారంభమైంది. తొలి రెండు రోజులు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకుఅ మలు చేస్తున్న 7.5 శాతం కోటా సీట్ల భర్తీకి చర్యలు తీసుకున్నారు. వివరాలు.. ఈ ఏడాది ఆర్ట్స్ అండ్ సైన్స్ కోర్సులకు రాష్ట్రంలో డిమాండ్ అన్నది మరింతగా పెరిగి విషయం తెలిసిందే. 180 ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలలో ఒక లక్షా 25 వేల సీట్లు ఉన్నాయి. ఈసీట్ల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించగా 2.25 లక్షల మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. వీరిలో ఒక లక్షా 84 వేల 762 మంది దరఖాస్తు రుసుం సైతం చెల్లించారు. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, బీఏ తమిళ్, బీకాం, బీఏ ఇంగ్లీషు, బిబిఏ, బీఎస్సీ కెమిస్ట్రీ కోర్సులకు డిమాండ్ మరింతగా పెరిగింది. 2025–26 విద్యా సంవత్సరానికి మరింతగా విద్యార్థులు ఆర్ట్స్ అండ్ సైన్స్ కోర్సుల సీట్ల కోసం ఎదురు చూస్తుండటంతో సీట్ల ను పెంచాల్సిన అవసరం ఏర్పడింది. ఈ విషయంగా సోమవారం ఉన్నత విద్యా మంత్రి కోవి చెలియన్ పరిశీలనానంతరం ఉత్తర్వులు జారీ చేశారు. దరఖాస్తుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో సీఎం స్టాలిన్తో చర్చించి విద్యార్థులకు మరింత భరోసా కల్పించే విధంగా సీట్ల పెంపునకు చర్యలు తీసుకున్నామని ప్రకటించారు. విద్యార్థుల అడ్మిషన్ల దరఖాస్తుల సంఖ్యను ఆధారంగా చేసుకుని ప్రభుత్వ కళాశాలలో 20 శాతం పెంచేందుకు నిర్ణయించామన్నారు. అలాగే, ఎయిడెడ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలకు 15 శాతం, స్వయం ప్రతి పత్తి హోదా కలిగిన కళాశాలలకు 10 శాతం సీట్లను పెంచుకునే అవకాశం కల్పిస్తూ చర్యలు తీసుకున్నామన్నారు.
7.5 శాతం కోటా సీట్ల భర్తీ
బీఈ, బీటెక్ వంటి ఇంజినీరింగ్ కోర్సుల ప్రవేశం నిమిత్తం ఆన్లైన్ ద్వారా కౌన్సెలింగ్ ప్రక్రియ ఉదయం నుంచి ప్రారంభమైంది. ఈనెల 11వ తేది వరకు క్రీడా, దివ్యాంగులు, మాజీ సైనికుల కోటా సీట్ల భర్తీ జరగనుంది. తొలి రెండు రోజులు రాష్ట్ర ప్రభుత్వ బడులలోచదువుకున్న విద్యార్థులకు ప్రత్యేకంగా అమలు చేస్తున్న 7.5 శాతం రిజర్వుడ్ కోటా సీట్ల భర్తీ మీద దృష్టి పెట్టారు. కటాఫ్ మార్కుల ఆధారంగా ఈ సీట్లను దక్కించుకునే విధంగా, ఉత్తమ కళాశాలలను ఎంపిక చేసుకునే దిశలో ప్రభుత్వ బడులలోని విద్యార్థులు ముందుకెళ్తున్నారు.