
క్లుప్తంగా
పులియం తోపులో
విరిగిపడిన మట్టి చర్యలు
తిరువొత్తియూరు: చైన్నెలోని పులియం తోపులోని 77వ వార్డులోని టిమ్లర్స్ రోడ్డులో వర్షపు నీరు ప్రవహించేందుకు పెద్ద గుంతలు తవ్వి పనులు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి అక్కడ మట్టి చరియలు విరిగిపడ్డాయి. ఇది చూసిన ప్రజలు దిగ్భ్రాంతి చెందారు. సమాచారం అందుకున్న, పోలీసులు అగ్నిమాపక శాఖ సిబ్బంది అక్కడికి చేరుకుని ఆ ప్రదేశంలో అడ్డుపెట్టి వాహనాల మరో మార్గంలో మళ్లించారు. అదృష్టవశాత్తూ ఎలాంటి నష్టం వాటిళ్లలేదని అధికారులు తెలిపారు.
ఎతిహాద్ ఎయిర్ వేస్
సేవల విస్తరణ
సాక్షి, చైన్నె: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జాతీయ విమాన సంస్థ ఎతిహాద్ ఎయిర్ వేస్ సేవలు విస్తృతం అయ్యాయని ఆసంస్థ చీఫ్ రెవెన్యూ ఆఫీసర్ అరిక్ దే తెలిపారు. ఎతిహాద్ ఎయిర్ వేస్ జైపూర్ – అబుదాబి మధ్య సేవలకు శ్రీకారం చుట్టి ఏడాది పూర్తైందన్నారు. 2024 జూన్ 16న నాలుగు విమానాలతో నాన్ స్టాప్ సేవలు మొదలైనా,డిసెంబరు నాటికి వారానికి పది సేవలు విస్తరించామన్నారు. ఇండియా నెట్వర్క్లో జైపూర్కు ప్రాముఖ్యత పెరుగుతున్నట్టు , ఈ ఏడాది సేవలు ఒక మైలురాయిగా పేర్కొన్నారు. ఎతిహాద్ సేవలను నెట్వర్క్లలో సౌకర్యవంతమైన కనెక్షన్ల ద్వారా విమాన షెడ్యూల్ ఆప్టిమైజ్ చేయడం, సేవల విస్తరణ దిశగా చర్యలు విస్తృతం చేశామన్నారు.
కొబ్బరి పీచు ఫ్యాక్టరీలో
భారీ అగ్ని ప్రమాదం
వేలూరు: వేలూరు జిల్లా గుడియాత్తం సమీపంలోని స్వామియార్ మఠం వద్ద ఉన్న అటవీ ప్రాంతం ఆనుకొని ఓ ప్రైవేటు కొబ్బరి పీచు ఫ్యాక్టరీ ఉంది. ఈ ఫ్యాక్టరీలో సోమవారం మధ్యాహ్నం ఉన్న ఫలంగా మంటలు చెలరేగాయి. మంటలను చూసిన కార్మికులు వెంటనే మంటలను అదుపు చేసేందుకు యత్నించారు. అయితే ఫ్యాక్టరీలో అధికంగా కొబ్బరి పీచులు ఉండడంతో మంటల ఎగిసి పడ్డాయి. దీంతో కార్మికులు గుడియాత్తం అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో అగ్నిమాప సిబ్బంది వెంటనే ఫ్యాక్టరీ వద్దకు చేరుకొని సుమారు 2 గంటల పాటు పోరాడి మంటలను అదుపు చేశారు. ఈ మేరకు గుడియాత్తం పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
పొత్తు లేకుంటే
గెలుపు కష్టమే
● రెండు ద్రవిడ పార్టీలకు
తిరుమావళవన్ సూచన
కొరుక్కుపేట: రెండు ద్రావిడ పార్టీలకు పొత్తు లేకుంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కష్టమే అవుతుందని, ఒంటరిగా పోటీ చేసి గెలిచే సత్తా లేదని వీసీకే పార్టీ నిర్వాహకులు తిరుమావలవన్ పేర్కొన్నారు. పొన్నేరిలో ఓ జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జాతీయ పార్టీలు బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడతాయి. కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి జనతా పార్టీ ఏర్పడినప్పుడు, ఢిల్లీలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. పాలక పార్టీ బలం పుంజుకున్నప్పుడే సంకీర్ణ ప్రభుత్వ వ్యవస్థ అమ
ల్లోకి వస్తుంది. 1967 తర్వాత ద్రావిడ పార్టీలు నేటి వరకు ప్రజాదరణ కలిగి ఉన్నాయని అన్నారు. రాష్ట్రాలలో ద్వేష రాజకీయాల ద్వారా క్రమబద్ధమైన హింస జరుగుతోంది. తమిళనాడులో కుల ఆధారిత దౌర్జన్యాలు , పోలీసుల దౌర్జన్యాలు ఎక్కువై పోయాయన్నారు. వీటిని నియంత్రించి పూర్తిగా నిర్మూలించాలని, అధికారంలో ఉన్నవారు దీనిపై ప్రత్యేక దష్టి పెట్టాలన్నారు. రెండు ద్రవిడ పార్టీలు తమిళనాడులో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత బలంగా లేవని, అవి అధికారంలోకి రావాలంటే సంకీర్ణం తప్పనిసరి అన్నారు.
టీఎన్సీసీ అధ్యక్షుడికి
నో ఎంట్రీ
సాక్షి, చైన్నె: తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే సెల్వపెరుంతొగైకు వెల్ల కోట్టై మురుగన్ ఆలయ కుంభాభిషేకంలో పాల్గొనేందుకు అనుమతించక పోవడం వివాదాస్పదంగా మారింది. శ్రీపెరంబదూరు రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి గెలిచిన సెల్వ పెరుంతొగై తొలుత కాంగ్రెస్ శాసన సభా పక్ష నేతగా వ్యవహరించారు. ప్రస్తుతం టీఎన్సీసీ అధ్యక్షుడయ్యారు. ఈ పరిస్థితులలో కాంచీపురం జిల్లా పరిధిలోని తన నియోజకవర్గంలో ఉన్న వెల్ల కోట్టై మురుగన్ ఆలయ కుంభాభిషేకానికి ఆయన వెళ్లారు.అయితే, ఆయన్ను అనుమతించ లేదు. జనంలో జనంగా ఆయన దూరంగా ఉండి కుంభాభిషేకాన్ని తిలకించారు. ఆయన వెల్ల కోట్ట మురుగన్ ఆలయంలో వేడుకలో భాగస్వామ్యం కాలేక పోవడానికి ఆయన సామాజిక వర్గం అడ్డుగా మారినట్టైంది. ఇక్కడ రెండు సామాజిక వర్గాల మధ్య రెండు దశాబాద్దాలుగా సాగుతున్న సమరమే కారణంగా పేర్కొన బడుతున్నది. అయితే, తనను అనుమతించక పోవడం గురించి సెల్వ పెరుంతొగై మాట్లాడుతూ, దశాబ్దా కాలంగా సాగుతున్న వివాదానికి ముగింపు ఎప్పుడో అంటూ, తాను మాత్రం జనంలో జనంగా ఉండి కుంభాభిషేకాన్ని తిలకించి వచ్చినట్టు వ్యాఖ్యానించారు.అధికారులు కూడా పట్టించుకోకుండా వ్యవహరించడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు.

క్లుప్తంగా