
రాజ్యసభకు ఆరుగురు
● ఏకగ్రీవంగా ఎంపిక
సాక్షి, చైన్నె : రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఆరుగురు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. వీరి ఎంపికకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని గురువారం అందజేశారు. రాష్ట్రానికి చెందిన ఆరుగురు రాజ్యసభ సభ్యుల పదవీ కాలం జూలైలో ముగియనున్న విషయం తెలిసిందే. వీరిలో డీఎంకేకు చెందిన విల్సన్, అబ్దుల్లా, షణ్ముగం, ఈ కూటమిలోని ఎండీఎంకేకు చెందిన వైగో ఉన్నారు. అలాగే, అన్నాడీఎంకేకు చెందిన చంద్రశేఖరన్, గతంలో ఈ కూటమి ద్వారా సీటు దక్కించుకున్న పీఎంకే చెందిన అన్బుమణి ఉన్నారు. ఈ ఆరు స్థానాలలో ఎమ్మెల్యేల సంఖ్యా బలం మేరకు డీఎంకే కూటమికి నాలుగు, అన్నాడీఎంకేకు రెండు దక్కినట్లైంది. ఈ పదవుల భర్తీకి నామినేషన్ల ప్రక్రియ 2వ తేదీ నుంచి ఈనెల 9వ తేదీ వరకు జరిగింది. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా నియమితులైన అసెంబ్లీ అదనపు కార్యదర్శి బి.సుబ్రమణియన్కు ఆశావహులు నామినేషన్లు సమర్పించారు.
ఆరుగురు ఏకగ్రీవం
ఈ ఎన్నికల నిమిత్తం ఆరు స్థానాల్లో నాలుగు డీఎంకే ఖాతాలోకి, రెండు అన్నాడీఎంకే అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఇందులో డీఎంకే తరఫున సీనియర్ న్యాయవాది విల్సన్, మాజీ ఎమ్మెల్యే సేలంకు చెందిన ఎస్ఆర్ శివలింగం, మహిళా రచయిత సల్మాను రాజ్యసభకు, ఈ కూటమి తరఫున మక్కల్ నీది మయ్యం నేత కమల్ ఉన్నారు. అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యేలు ఇన్బదురై, ఎం ధనపాల్ నామినేషన్ వేశారు. పరిశీలన, ఉప సంహరణ ప్రక్రియలు గురువారంతో ముగిశాయి. స్వతంత్రుల నామినేషన్లు ఇప్పటికే తిరస్కరణకు గురయ్యాయి. సాయంత్రం ఈ ఆరుగురి ఏకగ్రీవ ఎంపికకు సంబంధించిన ప్రకటనను ఎన్నికల అధికారి చేశారు. కమల్, సల్మా, శివలింగం తొలిసారిగా రాజ్యసభకు వెళ్లనున్నారు. విల్సన్ రెండవ సారిగా అడుగు పెట్టనున్నారు. అన్నాడీఎంకే తరఫున ఇన్బదురై, ధనపాల్ సైతం తొలిసారిగా అడుగు పెట్టనున్నారు. డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, మంత్రులు ఎం సుబ్రమణియన్ సమక్షంలో సాయంత్రం కమల్తోపాటు డీఎంకేకు చెందిన ముగ్గురు ధ్రువీకరణ పత్రాలను అందుకున్నారు.