
బీజేపీ నేతపై పోలీసుల గురి
– ఎనిమిది చోట్ల సోదాలు
సాక్షి, చైన్నె: బీజేపీ ఓబీసీ విభాగం కార్యదర్శి, రౌడీ కేఆర్ వెంకటేషన్పై పలు కేసులు ఉన్నాయి. చైన్నె శివార్లలో కట్ట పంచాయితీలు, ఎర్రచందనం స్మగ్లింగ్, తుపాకీతో బెదిరింపు కేసులు ఇందులో ఉన్నాయి. చైన్నె సెంట్రల్ క్రైంబ్రాంచ్ పోలీసులు శుక్రవారం ఇతడ్ని టార్గెట్ చేశారు. అతడి నివాసం, బంధువుల నివాసం, కార్యాలయాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. రెడ్హిల్స్ అసిస్టెంట్ కమిషనర్ రామరాజా రాబర్ట్ నేతృత్వంలో సోదాలు జరిగాయి. కేఆర్.వెంకటేషన్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వ్యాపార వేత్తలను బెదిరించడం వంటి కేసుల్లో అతడ్ని అరెస్టు చేసినట్టు సమాచారం. ఇటీవల ఇతడు కేంద్ర హోంమంత్రి అమిత్షాను కలవడం చర్చకు దారి తీసింది.
ఈవీఎంల గోడౌన్ తనిఖీ
తిరువళ్లూరు: కలెక్టరేట్లోని గోడౌన్లో భద్రపరిచిన ఈవీఎంలను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు చెందిన నేతల సమక్షంలో కలెక్టర్ ప్రతాప్ తనిఖీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గోడౌన్లలో వుంచిన ఈవీఎంలను రాజకీయ పార్టీ నేతల సమక్షంలో తనిఖీ చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. ఇందులో భాగంగానే తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ ప్రతాప్ గుర్తింపు చెందిన రాజకీయ పార్టీలకు చెందిన నేతల సమక్షంలో గోడౌన్ను తెరిచి ఈవీఎంలను పరిశీలించారు. వాటి పనితీరును రాజకీయ పార్టీలకు చెందిన నేతల సమక్షంలో ఆరా తీశారు. ఈవీఎంల భద్రత, పనితీరుతోపాటు ఇతర వాటిపై తనిఖీ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించిందని అందులో భాగంగానే తాము పరిశీలిస్తున్నట్టు వివరించారు. ఈవీఎంల భద్రత, పనితీరుపై అన్ని రాజకీయ పార్టీల నేతలు సంతృప్తి వ్యక్తం చేసినట్టు కలెక్టర్ తెలిపారు.
ఆగస్టులో కుతంబాక్కం బస్టాండ్ ప్రారంభం
సాక్షి, చైన్నె: చైన్నె శివారులో నిర్మిస్తున్న కుతంబాక్కం బస్టాండ్ పనులు ముగింపు దశకు చేరినట్టు, ఆగస్టులో ప్రారంభించేందుకు కసరత్తు చేపట్టామని సీఎండీఏ చైర్మన్, దేవదాయ శాఖ మంత్రి శేఖర్బాబు తెలిపారు. శుక్రవారం ఉత్తర చైన్నె పరిధిలోని తిరువికానగర్ బస్టాండ్, అగరం, జగన్నాథన్ వీధి, పెరియార్ బస్టాండ్, పేపర్ మిల్స్ రోడ్లలో నిర్మిస్తున్న బస్టాండ్లు, మార్కెట్లు, ఇతర పనులను శేఖర్బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చైన్నె, శివార్లలో బస్టాండ్లను ఆకర్షించే విధంగా ఆధునీకరిస్తున్నామని వివరించారు. చెంగల్పట్టు, మహాబలిపురం, ఆవడి, టీనగర్ బస్టాండ్లను అత్యంత సుందరంగా తీర్చిదిద్దే పనులపై దృష్టిపెట్టామన్నారు. కుతంబాక్కం బస్టాండ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, ఆగస్టులో ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నామని ఈసందర్భంగా ముడిచ్చూర్ బస్టాండ్ వ్యవహారంపై కోర్టులో కేసు ఉందని ఓ ప్రశ్నకు సమాధానం దాట వేశారు.
న్యూస్రీల్

బీజేపీ నేతపై పోలీసుల గురి