
డ్రాగా సామరస్య ప్రయత్నం
సాక్షి, చైన్నె: అన్బుమణితో సామరస్య ప్రయత్నం డ్రాగా ముగిసిందని, ఫలితం తేలలేదని పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు ఉద్వేగంతో వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదానికి పరిష్కారం లేదు, ముగింపు కూడా లేదని స్పష్టం చేశారు. పీఎంకెలోనే తండ్రి రాందాసు, తనయుడు అన్బుమణి మధ్య జరుగుతున్న అధికార సమరం క్లైమాక్స్కు చేరింది. పార్టీ సీనియర్లు, ముఖ్యులు సయోధ్యకు రాయబారం నడిపినా ఫలితం తేలలేదు. ఇదే విషయాన్ని గురువారం దిండివనంలోని తైలాపురం గెస్ట్ హౌస్లో మీడియాతో మాట్లాడుతూ రాందాసు స్పష్టం చేశారు. వివాదాల నేపథ్యంలో రాందాసు కీలక ప్రకటన చేయనున్న సమాచారంతో పీఎంకేలో ఉత్కంఠ నెలకొంది. అందరి దృష్టి తైలాపురం మీద పడింది. ఈ పరిస్థితుల్లో ఉదయం మీడియా ముందుకు వచ్చిన రాందాసు తీవ్ర ఉద్వేగంతో వ్యాఖ్యలు చేశారు.
కులదైవం అంటూ..గుండెల్లో పొడిచాడు
రాందాసు మాట్లాడుతూ పార్టీలో ఇటీవల కాలంగా చోటుచేసుకుంటూ వచ్చిన పరిణామాలను గుర్తు చేశారు. అన్బుమణికి తనకు మధ్య సామరస్య ప్రయత్నం డ్రాగా ముగిసిందన్నారు. ఈ సమస్యకు పరిష్కారం లేదు.ముగింపు లేదని స్పష్టం చేశారు. ఆయన(అన్బుమణి) ఇక్కడకు వచ్చారని, తాను అక్కడకు వెళ్లానని పేర్కొంటూ, ఆయన తనను నమ్మలేదని మండిపడ్డారు. పీఎంకే అధ్యక్ష పదవి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పినా, నమ్మడం లేదని, అయితే, అన్నీ ఆయనకే కావాలని పట్టుబట్టడం సబబు కాదన్నారు. అందుకే ఇక, నువ్వా, నేనా అని చూసుకుందామన్న నిర్ణయానికి వచ్చేసినట్టు వివరించారు. తనను కులదైవం అంటూనే గుండెల్లో పొడిచేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు తన ఫొటో పెట్టుకుని ఉత్సవం చేస్తున్నాడని, ఇక, ఈ సమస్యకు పరిష్కారం లేదని, మున్ముందు జరగబోయేది చూడండి అని వ్యాఖ్యలు చేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికల వరకు పీఎంకేకు తానే అధ్యక్షుడ్ని అని, తన నిర్ణయానికే అందరూ కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు. రాందాసు వ్యాఖ్యలపై అన్బుమణి స్పందించకున్నా, పాతవారిని తొలగించి కొత్త వారిని పదవుల్లో నియమించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వ్యాఖ్యలు చేశారు.
పరిష్కారం, ముగింపు లేదు
రాందాసు ఉద్వేగం