
వడపళని బస్ టెర్మినల్కు మోక్షం
● 12 అంతస్తుల భవనంగా నిర్మాణం
సాక్షి, చైన్నె : వడపళని బస్టాండ్ పనులకు మోక్షం లభించింది. చైన్నె నగరం నడి బొడ్డున ఉన్న ఈ బస్టాండ్ స్థానంలో 12 అంతస్తులతో భవనంతోపాటు ఇంటి గ్రేటెడ్ బస్ టెర్మినల్ ఏర్పాటు చేయబోతున్నారు. చైన్నె నగరంలో వడపళణి అత్యంత ముఖ్య ప్రాంతం. నగరం నడి బొడ్డున ఈ ప్రాంతం ఉంది. ఈ పరిసరాలు మాల్స్, ఆస్పత్రులతో నిండి ఉంటాయి. ఇక్కడ ఆర్కాడ్రోడ్డులో 6.65 ఎకరాల విస్తీర్ణంలో వడపళణి బస్ డిపోతోపాటుగా ఎంటీసీ బస్సుల సేవల నిమిత్తం బస్టాండ్ ఉంది. ఇక్కడి నుంచి రోజుకు 158 బస్సులు 1,158 సర్వీసులుగా వచ్చి వెళుతుంటాయి. ప్రస్తుతం ఈ పరిసరాలను కలుపుతూ మెట్రో రైలు సేవలు ఒక జంక్షన్గా ఏర్పాటు కానున్నది. ఈ పరిస్థితుల్లో రెకుల షెడ్డును తలపించేలా ఉన్న ఈ బస్టాండ్ను ఇంటిగ్రేటెడ్ బస్ టెర్మినల్గా మార్చేందుకు చైన్నె మెట్రోరైలు, తమిళనాడు ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ దృష్టి పెట్టాయి. 12 అంతస్తులతో భవనంగా ఇక్కడ నిర్మాణాలు చేపట్టనున్నారు. కింది భాగం పూర్తిగా బస్ టర్మినల్ను తలపించేలా నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇతర అంతస్తులలో వాణిజ్య సముదాయాలను తలపిస్తూ మాల్ రూపంలో ఏర్పాట్లకు సంబంధించిన నమూనాను తాజాగా సిద్ధం చేసి విడుదల చేశారు. రూ.481 కోట్లతో ఇక్కడ నిర్మాణాలకు అంచనా వ్యయంగా నిర్ణయించి ఉన్నారు.
ఘనంగా బాలకార్మికుల వ్యతిరేక దినోత్సవం
కొరుక్కుపేట: చైన్నె సెంట్రల్ రైల్వేస్టేషన్లో ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవాన్ని బుధవారం ఘనంగా జరుపుకున్నారు . ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ (ఐసీడబ్ల్యూఓ)తో కలిసి ఏవీఏ, జస్ట్ రైట్స్ఫర్ చిల్డ్రెన్, ఆర్పీఎఫ్, చైల్డ్ లైన్ సంయుక్తంగా బాల కార్మికుల నిర్మాలనపై అవగాహన కల్పించారు. పిల్లలను బడిబాట పట్టించాలని, పనులకు పంపొద్దు అంటూ ప్రత్యేక స్కిట్లతో అవగాహన తీసుకొచ్చారు. బాలకార్మికుల నిర్మూలనకు సంబంధించిచిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఇందులో ఐసీడబ్ల్యూఓ సెక్రటరీ ఏజే హరిహరన్, ఏవీఏ స్టేట్ కో– ఆర్డినేటర్ మాలిన్, రైల్వే పోలీసులు పాల్గొన్నారు.
టీవీకే ఐటీ ఇన్చార్జ్లు
సాక్షి, చైన్నె: తమిళ వెట్రి కళగం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) విభాగానికి రాష్ట్రవ్యాప్తంగా ఇన్చార్జ్లను నియమించింది. సామాజిక మాధ్యమాల ద్వారా ఈ ఇన్చార్జ్లు పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. ఈ ఇన్చార్జ్ల జాబితాను బుధవారం ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్ ప్రకటించారు. ఐటీ బృందానికి రాష్ట్ర స్థాయిలో సమన్వయకర్తలుగా అస్మిత్, సైమన్ ఇమాన్యుయేల్, ఆండ్రూ, మహేశ్, వినోద్కుమార్, లోకేశ్వరన్, సజీష్, సౌమ్య వ్యవహరిస్తారని వివరించారు. అలాగే, జోన్ల వారిగా పదిమంది చొప్పున సమన్వయ కర్తలను, ఇన్చార్జ్లను రంగంలోకి దించారు. చైన్నె, వేలూరు, తిరుచ్చి, మదురై, కోయబత్తూరు, కడలూరు, తంజావూరు, రామనాతపురం, సేలం, తిరునల్వేలి జోన్లుగా ఈ నియామకాలు జరిగాయి. అలాగే, లీగల్ టీమ్ కో–ఆర్డినేటర్లను సైతం నియమించారు.
బైక్ను ఢీకొన్న కారు
భర్త కళ్లెదుటే భార్య మృతి
తిరువళ్లూరు: బైక్ను కారు ఢీకొన్న ప్రమాదంలో భర్త కళ్లెదుటే భార్య మృతి చెందిన సంఘటన తిరువళ్లూరులో చోటుచేసుకుంది. తిరువళ్లూరులోని ఇందిరనగర్కు చెందిన మురుగన్. ఇతను మంగళవారం సాయంత్రం భార్య సెల్వీతో కలిసి పోలీవాక్కంలోని అక్క ఇంటికి బైక్లో బయలుదేరాడు. పోలీవాక్కం సమీపంలో వెళుతుండగా బైక్ను వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో సెల్వి(45) అక్కడికక్కడే మృతిచెందింది. తీవ్రంగా గాయపడిన మురుగన్ను స్థాఽనికులు తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మనవాలనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఫోటో:35: పోస్టర్లను ఆవిష్కరిస్తున్న హరిహరన్, పోలీసులు

వడపళని బస్ టెర్మినల్కు మోక్షం