
● నేడు కీలక ప్రకటన ● చట్ట పరంగా చర్యలు తప్పదు ● తిలక బా
సాక్షి, చైన్నె : పీఎంకేలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గురువారం కీలక ప్రకటన చేయబోతున్నట్టుగా ఆ పార్టీ వ్యవస్థాపకుడు రాందాసు చేసిన ప్రకటనతో అందరి చూపు తైలాపురం గెస్ట్ హౌస్ వైపు మళ్లింది. అదే సమయంలో ఇక కోశాధికారిగా చెప్పుకుని తిరిగితే చట్టపరంగా చర్యలు తప్పదని తిలక బామాకు పీఎంకే కోశాధికారిగా రాందాసు ద్వారా నియమితులైన సయ్యద్ మన్సుఫ్ హుస్సేన్ హెచ్చరించారు.
పీఎంకేలో రాందాసు, ఆయన తనయుడు అన్బుమణి రాందాసు మధ్య నెలకొన్న వివాదం ముదిరి పాకాన పడింది. తనకు మద్దతుగా ఉన్న జిల్లాల కార్యదర్శులతో సమాలోచనలకు అన్బుమణి పిలుపు నిచ్చిన నేపథ్యంలో రాందాసు మరో అడుగు ముందుకేశారు. గురువారం తైలాపురంలో మీడియా ముందుకు రానున్నట్టు, కీలక ప్రకటన చేయబోతున్నట్టు ప్రకటించడంతో ఉత్కంఠ నెలకొంది. ఈ వార్లో తనదే పై చేయి కావాలన్న నిర్ణయంతో ఉన్న రాందాసు ఎలాంటి ప్రకటన చేయబోతున్నారో? అని పీఎంకే వర్గాలు తైలాపురం వైపు దృష్టి పెట్టాయి.
రాందాసు, అన్బుమణి
చట్ట పరంగా..హెచ్చరిక
పీఎంకేలో తనకు వ్యతిరేకంగా ఉంటూ, అన్బుమణికి మద్దతుగా ఉన్న పలు జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులను పదవుల నుంచి రాందాసు తొలగిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. పార్టీ అనుబంధ విభాగాలలోనూ మార్పులు వేగంగా జరుగుతున్నాయి. అయితే, తానే అధ్యక్షుడ్ని అని, తాను సంతకం పెట్టకుండా ఎవరిని తొలగించ లేరని, అందరూ వారి వారి పదవుల్లో కొనసాగవచ్చని అన్బుమణి భరోసా ఇస్తూ వస్తున్నారు. అయితే తొలగించిన వారి స్థానంలో కొత్త వారు బాధ్యతలు చేపట్టేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీలో ఏ పదవిలో ఎవరు ఉండాలో..? అన్న నిర్ణయించే అధికారం రాందాసుకు తప్ప మరొకరికి లేదని ఆ పార్టీ కోశాధికారిగా నియమితులైన సయ్యద్ మన్సూఫ్ హుస్సేన్ బుధవారం ప్రకటించారు. తొలగించిన వారంతా పదవుల్లో కొనసాగుతున్నట్టుగా గాని, ఆ పదవుల్ని అంటిపెట్టుకుని చెలామణి అవుతుంటే ఇక చట్ట పరంగా చర్యలు తప్పవని హెచ్చరించడం గమనార్హం. పార్టీకి తానే కోశాధికారి అని, ఇకపై సత్యబామ తను కోశాధికారి అని చెప్పుకుని తిరిగిన పక్షంలో చట్ట పరంగా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. పార్టీలో పదవుల భర్తీ విషయంలో నియామక అధికారం అన్నది ఒక్క వ్యవస్థాపకుడు రాందాసుకు మాత్రమే ఉందని, ఎవరైనా ఉల్లంఘిస్తే చట్ట పరంగా చర్యలు తప్పవని హెచ్చరించడం గమనార్హం. అదే సమయంలో రాందాసు ప్రకటన ఆధారంగా తన బలాన్ని చాటేలా పార్టీ సర్వ సభ్య సమావేశానికి పిలుపు నిచ్చే దిశగా అన్బుమణి సైతం వ్యూహాలకు పదును పెట్టారు.