
ఆ పార్టీలు మాతో సంప్రదిస్తున్నాయి
● నైనార్ వ్యాఖ్యల చర్చ
సాక్షి, చైన్నె: తమతో డీఎంకే కూటమిలోని పార్టీలు సంప్రదిస్తున్నట్టు, ఓ పార్టీ అయితే, మరింత దగ్గరకు వచ్చినట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, కేంద్ర సహాయమంత్రి వేల్మురుగన్ వేర్వేరుగా ప్రకటించారు. ఇది కాస్త డీఎంకే కూటమిలో చర్చకు దారితీసింది. అదే సమయంలో కూటమిలో సీట్ల నినాదం తెరపైకి వస్తున్నది. తమకు ఈసారి ఎక్కువ సీట్లు కావాలని సీపీఎం నేత షణ్ముగం ప్రకటించిన విషయం తెలిసిందే. అదేసమయంలో బుధవారం వీసీకే నేత తిరుమావళవన్ మీడియాతో మాట్లాడుతూ, తాము కూడా అధిక సీట్లను ఆశిస్తున్నామని, ఆ దిశగా డీఎంకేను కోరుతామన్నారు. ఈ పరిస్థితుల్లో కూటమిలో గందరగోళం సృష్టించడం లేదా, చర్చను తెరపైకి తెచ్చే రీతిలో బుధవారం నైనార్ నాగేంద్రన్, ఎల్.మురుగన్ వేర్వేరుగా స్పందించడం గమనార్హం. డీఎంకే కూటమిలోని పార్టీలు తమ కూటమితో సంప్రదింపుల్లో ఉన్నట్టు, ఒక పార్టీ అయితే, మరీ దగ్గరగా వచ్చినట్టు వ్యాఖ్యానించారు. డీఎంకే కూటమిలో చీలిక తథ్యమని, బీజేపీ, అన్నాడీఎంకే నేతృత్వంలోని కూటమి మరింత బలోపేతం కావడం తథ్యమని స్పష్టం చేశారు. ఇందుకు స్పీకర్ అప్పావు గట్టిగానే సమాధానం ఇస్తూ డీఎంకే కూటమి పార్టీలను వెనకేసుకొచ్చారు. అసలు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి ఎన్నికల సమయం వరకు బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తారా అనేది అనుమానమేనని వ్యాఖ్యానించారు. ఆయన తెలివిమంతుడు అని, తన దగ్గరకు వచ్చే ఆ పార్టీ ఎమ్మెల్యేలే పలువురు తాజా కూటమిపై పెదవి విప్పడం జరుగుతోందని, ముందుగా ఆ కూటమి పరిస్థితి మున్ముందు ఎలా ఉంటుందో చూసుకోమనండి అని నైనార్ నాగేంద్రన్కు అప్పావు కౌంటర్ ఇవ్వడం గమనార్హం. అయితే, బీజేపీకి దగ్గరగా వెళ్లిన డీఎంకే కూటమిలోని ఆ పార్టీ ఏదో అని ఆరా తీసే వాళ్లు పెరిగారు.