
‘సెయింట్ ఆంథోనియార్’ వజ్రోత్సవం
● వేడుకలకు శ్రీకారం
సాక్షి, చైన్నె : చైన్నె శివారులోని ఆవడిలో ఉన్న సెయింట్ ఆంథోనియార్ మందిరం 75వ వార్షికోత్సవానికి శ్రీకారం చుట్టారు. మంగళవారం రాత్రి జరిగిన పతకావిష్కరణతో ఉత్సవాలు మొదలయ్యాయి. ఈనెల 15వ తేదీ వరకు అత్యంత వైభవంగా ఉత్సవాలకు ఏర్పాట్లు చేశారు. రెవరండ్ జీజే నేతృత్వంలో జరిగిన ఈ వేడుకకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. 1943లో రెవరెండ్ జాన్ వెన్నార్డ్ ఆవడి పరిసరాల్లో క్రైస్తవ సామాజిక వర్గం కోసం ఈ మందిరం ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. ఆవడి, కామరాజ్ నగర్, పట్టాభిరామ్, అంబత్తూర్ పరిసరాల్లో క్రైస్తవ సామాజిక వర్గం కోసం ఇక్కడ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 1950లో విద్యా కార్యక్రమాలతో సేవలకు శ్రీకారం చుట్టారు. 1958లో అప్పటి ఎక్సలెన్సీ లూయిస్ మథియాస్ కొత్త చర్చికి పునాది రాయి వేశారు. 1959 జూలై 5న చైన్నె ఆర్చ్ డియోసెస్ సహ బిషప్ హిజ్ ఎక్సలెన్సీ ఫ్రాన్సిస్ కార్వాల్హో ఈ చర్చిని ప్రారంభించారు. ఆవడిలోని సెయింట్ ఆంథోనియార్ చర్చిని 2010 నవంబర్ 21న చైన్నె ఆర్చ్ బిషప్ అయిన యు.ఎ. చిన్నప్ప ఒక పుణ్యక్షేత్రంగా ప్రకటించారు. సెయింట్ ఆంథోనీ ఆవిష్కరణలతో నిండిన ఈ పవిత్ర ప్రదేశానికి కులాలు, మతాలకతీతంగా వేలాది మంది తరలి వస్తున్నారు. ప్రస్తుతం 75వ వార్సికోత్సవం నిర్వహణకు చర్యలు తీసుకున్నారు. మంగళవారం రాత్రి జరిగిన జెండా ఆవిష్కరణతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా శాంతి పావురాలను ఎగుర వేశారు. ఈనెల 13వ తేదీన ఆరు గంటల నుంచి ప్రత్యేక వేడుకలు, 14వ తేదీన మరిన్ని కార్యక్రమాలతోపాటుగా తీర్థ తిరువిలా అంటూ 15వ తేదీ వరకు వేడుకలు జరగనున్నాయి.