
ఒంటరికై నా సిద్ధం!
సాక్షి, చైన్నె: 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోటీకై నా వెనుకాడబోమని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్ వ్యాఖ్యానించారు. అరుప్పుకోట్టై అసెంబ్లీ నియోజకవర్గం నుంచి యువజన నేత విజయప్రభాకరన్ పోటీ చేయాలని పార్టీ వర్గాలు విన్నవించుకోవడంతో ఆ దిశగా ఆయన దృష్టిపెట్టే పనిలో పడ్డట్టు సంకేతాలు వెలువడ్డాయి. బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల పార్టీ నిర్వాహకులతో సమావేశాలకు డీఎండీకే ప్రధాన కార్యదర్శి నిర్ణయించారు. తొలిరోజున దక్షిణ తమిళనాడులోని తూత్తుకుడి, తిరునల్వేలి, కన్యాకుమారి, మదురై, విరుదునగర్, రామనాథపురం, తెన్కాశి జిల్లాల నేతలతో సమావేశమయ్యారు. ఆయా జిల్లాల్లో పార్టీ పరిస్థితి, బలోపేతం దిశగా చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరించారు. కూటమిగా, ఒంటరిగానైనా సరే అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించినట్టు తెలిసింది. అదే సమయంలో విరుదునగర్ జిల్లా అరుప్పుకోట్టై అసెంబ్లీ నియోజకవర్గం నుంచి యువజన నేత విజయకాంత్ వారసుడు విజయ ప్రభాకరన్ పోటీ చేయాలన్న నినాదాన్ని నేతలు అందుకున్నారు. దీంతో ఆదిశగా కార్యక్రమాలపై దృష్టిపెట్టేందుకు విజయప్రభాకరన్ నిర్ణయించినట్టు సమాచారం. విరుదునగర్ లోక్సభకు పోటీ చేసిన సమయంలో ఇక్కడి అరుప్పుకోట్టై అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థికన్నా అత్యధికంగా ఓట్లను విజయ ప్రభాకరన్ సాధించడంతోనే ఆయన్ను ఆ నియోజకవర్గం నుంచి పోటీచేయాలన్న ప్రతిపాదనను పార్టీ ముందు దక్షిణాది జిల్లాల నేతలు ముందు ఉంచినట్టు తెలిసింది. ఇక, ఈ సమావేశానంతరం మీడియాతో ప్రేమలత విజయకాంత్ మాట్లాడుతూ ప్రస్తుతం తాము ఏ కూటమిలోనూ లేమని, కూటమి నిర్ణయం జనవరిలో స్పష్టం చేస్తామన్నారు. ఒంటరిగానైనా ఎన్నికలను ఎదుర్కొనేందుకు వెనుకాడబోమన్నారు.