
దేశానికే ఆదర్శం తమిళనాడు
● పలు పథకాల్లో దేశానికే ఇంజిన్ ● సీఎం స్టాలిన్ ● తరమణిలో గ్లోబల్ బిజినెస్ సెంటర్ ● సెంట్రల్ మెట్రోస్టేషన్లో బుక్ పార్క్ ఏర్పాటు
సాక్షి,చైన్నె: దేశానికే ఆదర్శంగా తమిళనాడు ఉన్నట్టు సీఎం స్టాలిన్ అన్నారు. పథకాల అమల్లో దేశానికి రైలు ఇంజిన్లా మారినట్టు ధీమా వ్యక్తం చేశారు. చైన్నె తరమణిలో ప్రపంచ బ్యాంక్ నేతృత్వంలో గ్లోబల్ బిజినెస్ సెంటర్ను పునరుద్ధరించారు. 1,500 మంది ఉద్యోగులు 189కి పైగా బ్యాంకు కార్యాలయాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా సేవలందించేందుకు ప్రధాన కేంద్రంగా దీనిని తీర్చిదిద్దారు. చైన్నెలో కీలక పాత్ర పోషించే విధంగా రూపుదిద్దుకున్న ఈ సెంటర్ను సీఎం స్టాలిన్ మంగళవారం ప్రారంభించారు. ఎంపీలు తమిళచ్చి తంగ పాండియన్, డాక్టర్ కనిమొళి సోము, ఎమ్మె ల్యేలు హసన్ మౌలానా, సోము, సీఎస్ మురుగానందం, ప్రపంచ బ్యాంక్ ఎండీ వేంకై జాంగ్, భారతదేశ కంట్రీ డైరెక్టర్ అగస్టే డానోగోమ్, చైన్నె సెంటర్ హెడ్ సునీల్కుమార్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజిటల్ సర్వీసెస్ విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రజేంద్ర నవనీత్, వాణిజ్యశాఖ కార్యదర్శి వి.అరుణ్రాయ్ పాల్గొన్నారు.
అత్యంత పట్టణీకరణ రాష్ట్రంగా తమిళనాడు
సీఎం స్టాలిన్ మాట్లాడుతూ 1971లో ప్రపంచ బ్యాంకుతో తమిళనాడు భాగస్వామ్యం మొదలైనట్టు గుర్తు చేశారు. వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, విద్య, విపత్తు నిర్వహణ, పట్టణాభివృద్ధితో పాటు వివిధ రంగాల ప్రగతికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు చెప్పారు. 2022లో ఢిల్లీ తర్వాత చైన్నెలో మొదటి ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారని, దీంతో దక్షిణ భారతదేశంతో ప్రపంచ బ్యాంకు సంబంధం మరింత బలపడిందన్నారు. పేదరికాన్ని నిర్మూలించడం, గ్రామీణ ప్రజల జీవనోపాధిని మెరుగుపరచడం లక్ష్యంగా అమలు చేస్తున్న పథకాలు, ప్రాజెక్టులను సీఎం వివరించారు. మహిళలకు సాధికారత కల్పించడమే కాకుండా, రైతులకు స్థిరమైన ప్రగతి దిశగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నామన్నారు. ప్రస్తుతం తమిళనాడు వ్యాప్తంగా తోళి పేరిట వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని, త్వరలో చైన్నెలో ఫ్లోర్ ఎలక్ట్రిక్ బస్సులు మరిన్ని అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. దేశంలో అత్యంత పట్టణీకరణ చెందిన రాష్ట్రంగా తమిళనాడు మారుతోందని, 2030 నాటికి తమిళనాడు జనాభాలో 63 శాతం ప్రజలు పట్టణ ప్రాంతాల్లోనే నివశిస్తారని తెలిపారు. అందరికీ అన్నీ అనే నినాదంతో ముందుకెళ్తున్న తమకు అవసరమైన సామాజిక–ఆర్థిక అభివృద్ధి అవసరాల కోసం పెట్టుబడులకు ప్రపంచ బ్యాంకు సహాయం మరింతగా ఆశిస్తున్నామన్నారు.
న్యూస్రీల్
చైన్నె సెంట్రల్ మెట్రోస్టేషన్లో బుక్ పార్క్
ముందుగా చైన్నె సెంట్రల్ రైల్వేస్టేషన్ వద్ద ఉన్న మెట్రో రైల్వేస్టేషన్లో రూ.1.85 కోట్లతో నిర్మించిన చైన్నె బుక్పార్క్ను సీఎం స్టాలిన్ ప్రారంభించారు. అలాగే, రూ.29.80 కోట్లతో వివిధ ప్రాంతాల్లో నిర్మించిన 110 అదనపు లైబ్రరీ భవనాలను ప్రారంభించారు. పరమకుడి బ్రాంచ్ లైబ్రరీ భవనం, మరో 70 ప్రత్యేక లైబ్రరీలు ప్రారంభించారు. తమిళనాడు పాఠ్యపుస్తకాలు, విద్యాసేవలు విభాగం రూపొందించిన 84 వివిధ పుస్తకాలను ఆవిష్కరించారు. అలాగే, పుస్తకాల విక్రయానికి ఈ కామర్స్ సేవలతో వెబ్సైట్ను పరిచయం చేశారు. మంత్రులు శేఖర్బాబు, అన్బిల్ మహేష్ పొయ్యమొళి, గ్రేటర్ చైన్నె కార్పొరేషన్ మేయర్ ఆర్.ప్రియ, పాల్గొన్నారు.

దేశానికే ఆదర్శం తమిళనాడు

దేశానికే ఆదర్శం తమిళనాడు

దేశానికే ఆదర్శం తమిళనాడు