
‘కీలడి’ ఆధారాలు నిరూపితం కాలేదు
● కేంద్ర మంత్రి షెకావత్ ● 11 సంవత్సరాలు స్వర్ణయుగం
సాక్షి, చైన్నె: కీలడి పురావస్తు పరిశోధనల ఆధారాలు శాసీ్త్రయంగా, సాంకేతికంగా ఇంకా నిరూపితం కాలేదని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ స్పష్టం చేశారు. మదురై సమీపంలోని కీలడిలో మూడేళ్ల పాటు పురావస్తు శాస్త్రవేత్త అమర్నాథ్ రామకృష్ణన్ నేతృత్వంలో పురావస్తు పరిశోధనలు జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిశోధనలలో తమిళ సంస్కృతి, నాగరికతకు సంబంధించిన ఎన్నో ఆధారాలు బయటపడ్డట్టుగా ప్రచారం జరిగింది. అదేసమయంలో ఈ పరిశోధనను కేంద్రం హఠాత్తుగా నిలుపుదల చేయడం చర్చకు దారి తీసింది. ఇక, తమిళ సంస్కృతి, సంప్రదాయాలు, పురాతనలపై అధ్యయనానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి నిధులను కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో 2016 నుంచి ఇక్కడ పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఇక్కడ లభించిన వస్తువులను ఓపెన్ ఎగ్జిబిషన్లో ఉంచారు. అలాగే, ఇక్కడ బ్రహ్మాండ ఆడిటోరియం, ఎగ్జిబిషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకున్నా, ఈ పరిస్థితుల్లో మూడేళ్లు జరిగిన పరిశోధన అర్ధాంతరంగా ఆగడం, ఇందులో వెలుగు చూసిన అంశాలను బహిర్గతం చేయాలని కోరుతూ ధర్మాసనంలో పిటిషన్ సైతం విచారణలో ఉంది. ఈ పురావస్తు పరిశోధనలోని అంశాలను కేంద్రం నిరాకరించినట్టుగా చర్చ సైతం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో మంగళవారం చైన్నెకు వచ్చిన కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ టీ.నగర్లోని బీజేపీ ప్రధాన కార్యాలయం కమలాలయానికి వెళ్లారు. అక్కడ జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ 11 సంవత్సరాల పాలనపై రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కీలడి పరిశోధనలకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అమర్నాథ్ బృందం జరిపిన పురావస్తు పరిశోధనలోని అంశాలు శాసీ్త్రయంగా, సాంకేతికపరంగా నిరూపితం కాలేదని, మరిన్ని ఆధారాలు అవశ్యమని స్పష్టం చేశారు.
11 ఏళ్ల పాలన స్వర్ణయుగం
ప్రధాని నరేంద్ర మోదీ నేత్వత్వంలో ఇప్పటివరకు 11 సంవత్సరాల పాటు సాగిన పాలన అమృత్కాల్(స్వర్ణయుగం) అని వ్యాఖ్యలు చేశారు. సుపరిపాలన, పేద ప్రజల సంక్షేమంపై దృష్టి పెడుతూ కొత్త ప్రయాణం, అభివృద్ధి ప్రయాణం మరింత వేగం పుంజుకోనున్నట్టు వివరించారు. సర్వతోముఖాభివృద్ధి వైపు దేశం దూసుకెళ్తోందన్నారు. 11 సంవత్సరాలు ఈ దేశాన్ని ప్రగతి పథకంలో నడిపించారని, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను తీర్చిదిద్దేందుకు కట్టుబడి పనిచేస్తున్నామన్నారు. సరిహద్దుల్లో భద్రత పటిష్టంగా ఉందని, దేశంలో శాంతి, స్థిరత్వాన్ని నెలకొల్పి, సాంకేతికతను బలోపేతం చేసి ప్రతి పౌరుడికి పథకాలు దరిచేర్చే విధంగా విస్తృత చర్యలతో ముందుకెళ్తున్నామని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడ నైనార్ నాగేంద్రన్, మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు.