
రాజ్యసభకు ఆరుగురు ఏకగ్రీవం
సాక్షి, చైన్నె: రాష్ట్రం నుంచి రాజ్యసభలో ఆరుగురు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. అయితే, అధికారిక ప్రకటన ఈనెల 12న వెలువడనుంది. రాష్ట్రానికి చెందిన ఆరుగురు రాజ్యసభ సభ్యుల పదవీ కాలం జూలైలో ముగియనున్న విషయం తెలిసిందే. వీరిలో డీఎంకేకు చెందిన విల్సన్, అబ్దుల్లా, షణ్ముగం, ఈ కూటమిలోని ఎండీఎంకేకు చెందిన వైగో ఉన్నారు. అలాగే, అన్నాడీఎంకేకు చెందిన చంద్రశేఖరన్, గతంలో ఈ కూటమి ద్వారా సీటు దక్కించుకున్న పీఎంకేకు చెందిన అన్బుమణి ఉన్నారు. ఈ ఆరు స్థానాల్లో ఎమ్మెల్యేల సంఖ్యా బలం మేరకు డీఎంకే కూటమికి నాలుగు, అన్నాడీఎంకేకు రెండు దక్కినట్లైంది. ఈ పదవుల భర్తీకి నామినేసన్ల ప్రక్రియ 2వ తేదీ నుంచి ఈనెల 9వ తేదీ వరకు జరిగింది. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా నియమితులైన అసెంబ్లీ అదనపు కార్యదర్శి బి.సుబ్రమణియన్కు ఆశావహులు నామినేషన్లు సమర్పించారు. తొలుత ఎన్నికల వీరుడు పద్మరాజన్ సహా పలువురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ వేశారు. అయితే, వీరికి ఎమ్మెల్యేల ప్రతిపాదన మద్దతు లేని దృష్ట్యా, మంగళవారం జరిగిన పరిశీలనలో తిరస్కరించారు.
ఏకగ్రీవం..
ఈ ఎన్నికల నిమిత్తం ఆరు స్థానాల్లో నాలుగు డీఎంకే ఖాతాలోకి, రెండు అన్నాడీఎంకే అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఇందులో డీఎంకే తరఫున సీనియర్ న్యాయవాది విల్సన్, మాజీ ఎమ్మెల్యే సేలంకు చెందిన ఎస్ఆర్ శివలింగం, మహిళా రచయిత సల్మాను, ఈ కూటమి తరఫున మక్కల్ నీది మయ్యం నేత కమల్ ఉన్నారు. అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యేలు ఇన్బదురై, ఎం.ధనపాల్ నామినేషన్ వేశారు. మంగళవారం జరిగిన పరిశీలనలో డీఎంకే, అన్నాడీఎంకే తరఫున దాఖలు చేసిన ఆరుగురి నామినేషన్లు ఆమోదం పొందాయి. స్వతంత్రుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఎన్నికలు జరగకుండానే ఈ ఆరుగురి ఎంపిక ఏకగ్రీవమైనట్లైంది. అయితే, ఉపసంహరణకు 12వ తేదీ వరకు గడువు ఉన్న దృష్ట్యా, ఆ రోజున ఈ ఆరుగురి ఎంపికకు సంబంధించిన ఏకగ్రీవ ప్రకటన వెలువడనుంది.
12న అధికారిక ప్రకటన

రాజ్యసభకు ఆరుగురు ఏకగ్రీవం