
అన్బుమణి వర్కింగ్ ప్రెసిడెంట్
● రాందాసు స్పష్టం
సాక్షి, చైన్నె: అన్బుమణి పీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ అని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు రాందాసు స్పష్టం చేశారు. అదే సమయంలో పీఎంకేను వీడి, బీజేపీలోకి చేరి మళ్లీ మాతృగూటికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే రవిరాజ్కు పార్టీ ఉపాధ్యక్ష పదవిని రాందాసు కట్టబెట్టారు. పీఎంకేలో అధ్యక్ష వార్ తారా స్థాయిలో సాగుతున్న విషయం తెలిసిందే. దీనిని కొలిక్కి తెచ్చేలా బీజేపీ, అన్నాడీఎంకే పెద్దలు రంగంలోకి దిగినా ఫలితం శూన్యంగా మారింది. తానే అధ్యక్షుడ్ని అని రాందాసు ఓ వైపు, కాదు, కాదు తానే అంటూ అన్బుమణి పరస్పరం ప్రకటించుకుంటూ రావడంతో వివాదం మరింతగా ముదురుతోంది. అదే సమయంలో అన్బుమణికి అనుకూలంగా వ్యవహరిస్తున్న పార్టీ ముఖ్యనేతలను పదవుల నుంచి తొలగించి తనకు అనుకూలంగా ఉన్న వారిని నియమించుకునే ప్రక్రియను రాందాసు వేగవంతం చేశారు. ఈ పరిస్థితుల్లో అన్బుమణి కేవలం పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ మాత్రమే అని రాందాసు మంగళవారం స్పష్టం చేశారు. అన్బుమణికి ప్రకటనకు చెక్ పెట్టేలా ఈ వ్యాఖ్యలు ఆయన చేయడం గమనార్హం. అలాగే, పీఎంకేను వీడి బీజేపీలోకి చేరిన మాజీ ఎమ్మెల్యే రవిరాజ్ మళ్లీ మాతృగూటికి చేరారు. అన్బుమణిపై తీవ్ర వ్యతిరేకతతో ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్లినట్టు ప్రచారం జరిగింది. తాజాగా రాందాసు ఇచ్చిన పిలుపుతో మళ్లీ రవిరాజ్ పీఎంకేలోకి వచ్చేశారు. ఆయనకు ఏకంగా పార్టీ ఉపాధ్యక్ష పదవిని రాందాసు అప్పగించారు. అన్బుమణికి మద్దతుగా ఉన్న వారిని తొలగిస్తూ, వ్యతిరేకంగా ఉన్న వారికి పదవులను రాందాసు కట్టబెడుతుండడంతో తండ్రి, తనయుడి మధ్య వార్ మరిన్ని ధారావాహికలుగా మున్ముందు సాగే అవకాశాలు ఉన్నాయన్న చర్చ ఊపందుకుంది. కాగా బుధవారం మీడియాతో సమగ్ర వివరాలు పంచుకోనున్నట్లు రాందాసు ప్రకటించడంతో ఎలాంటి ప్రకటనలు చేస్తారో ఉన్న ఉత్కంఠ నెలకొంది.