సీసీ టీవీ ఫుటేజీలు సమర్పించండి | - | Sakshi
Sakshi News home page

సీసీ టీవీ ఫుటేజీలు సమర్పించండి

Jun 11 2025 8:56 AM | Updated on Jun 11 2025 8:56 AM

సీసీ టీవీ ఫుటేజీలు సమర్పించండి

సీసీ టీవీ ఫుటేజీలు సమర్పించండి

● నీట్‌ పరీక్ష వ్యవహారంలో హైకోర్టు

సాక్షి,చైన్నె: విద్యుత్‌ సరఫరా అంతరాయం విషయంలో పరీక్ష కేంద్రాల్లోని సీసీ టీవీ కెమెరాల ఫుటేజీలను సమర్పించాలని మద్రాసు హైకోర్టు ద్విసభ్య బెంచ్‌ ఆదేశించింది. గత నెల 4వ తేదీన 2025–26 సంవత్సరానికిగాను వైద్య కోర్సుల ప్రవేశ నిమిత్తం నీట్‌ యూజీ పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. చైన్నెలో అకాల వర్షం కారణంగా అనేక పరీక్ష కేంద్రాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో మూడు సెంటర్లలో పరీక్ష రాసిన 13 మంది విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించగా, ఫలితాల విడుదలకు స్టేను తొలుత విధించారు. తరువాత కేంద్రం తరఫున వాదన కోర్టుకు చేరడంతో దేశవ్యాప్తంగా మళ్లీ పరీక్షల నిర్వహణ అసాధ్యంగా స్పష్టం చేసిన సింగిల్‌ బెంచ్‌ పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో విద్యార్థులు అప్పీలుకు వెళ్లగా మంగళవారం ద్వి సభ్య బెంచ్‌ విచారించింది. సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని, ఎలాంటి స్టే ఇవ్వలేమని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. అయితే, విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగిన రోజున ఆయా పరీక్ష కేంద్రాల్లో నమోదైన సీసీ టీవీ కెమెరాల దృశ్యాలను కోర్టుకు సమర్పించాలని అధికారులను ఆదేశిస్తూ న్యాయమూర్తులు ఉత్తర్వులు జారీ చేశారు.

కిలాంబాక్కంలో అదనపు బస్సులు

సాక్షి, చైన్నె: కిలాంబాక్కం కలైంజ్ఞర్‌ కరుణానిధి శతజయంతి స్మారక సబర్బన్‌ బస్‌ టెర్మినల్‌లో ఇక అదనపు బస్సులను నిలుపుదల చేయడానికి రవాణా సంస్థ చర్యలు తీసుకుంది. చైన్నెకి దక్షిణ దిక్కులో కిలాంబాక్కం బస్‌ టెర్మినల్‌ ఏర్పాటైన విషయం తెలిసిందే. ఇక్కడి నుంచి దక్షిణ తమిళనాడులోని తిరుచ్చి, మదురై, తిరునల్వేలి, కన్యాకుమారి ఇతర నగరాలు, కొంగు మండలంలోని సేలం, ఈరోడ్‌, కోయంబత్తూరు నగరాలు, సముద్ర తీర జిల్లాలైనా కడలూరు, నాగపట్నం ఇతర జిల్లాలకు బస్సులు నడుస్తున్నాయి. అయితే ఇక్కడ ఆశించిన మేరకు బస్సుల సేవలు అందడంలేదని ప్రయాణికులు తరచూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారాంతం లేదా వరుస సెలవులు, లేదా ముఖ్యపండుగల సమయాల్లో ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. మిగిలిన సమయాల్లో సాధారణంగా నడిచే బస్సులు రోడ్డెక్కుతున్నాయి. అయితే, తరచూ ఇక్కడ బస్సులు పూర్తిస్థాయిలో లేకపోవడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో నిత్యం ప్రయాణికులు ఆందోళనకు దిగుతున్నారు. దీనిని గుర్తించిన రవాణా సంస్థ ఇక ప్రతిరోజూ కిలాంబాక్కం బస్టాండ్‌లో సాధారణంగా నడిచే బస్సులతోపాటు అదనంగా బస్సులను నిలుపుదల చేయాలని నిర్ణయించారు. ప్రయాణికుల సంఖ్యను ఆధారంగా పార్కింగ్‌లో సిద్ధంగా ఉంచిన బస్సులు ఆయా మార్గాల్లో నడిపేలా చర్యలు తీసుకునేందుకు రవాణా సంస్థ ఏర్పాట్లు చేపట్టింది.

డాక్టర్‌ పళణి వేల్‌కు జేఏటీఎస్‌ పురస్కారం

సాక్షి, చైన్నె : చైన్నెకి చెందిన డాక్టర్‌ సి. పళణివేలుకు విదేశీ గౌరవ సభ్యత్వం, జీవిత సాఫల్య పురస్కారాన్ని జపనీస్‌ అసోసియేషన్‌ ఫర్‌ థొరాసిక్‌ సర్జరీ(జేఏటీఎస్‌) ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబర్‌ 23 నుంచి 25వ తేదీ వరకు జపాన్‌లోని ఒసాకాలో జరిగే కార్యక్రమంలో ఈ పురస్కారం ప్రదానం చేయనున్నారు. చైన్నె జెమ్‌ ఆస్పత్రి చైర్మన్‌గా ఉన్న డాక్టరి సి.పళణివేలు ల్యాప్రోస్కోపిక్‌, థొరాకోస్కోపిక్‌ చికిత్సలు, ఆవిష్కరణలకు ప్రసిద్ధి చెందారు. ల్యాప్రోస్కోపిక్‌ అన్నవాహిక శస్త్రచికిత్సలో ఆయన మార్గదర్శక కృషిని అభినందిస్తూ ఈ పురస్కారానికి జపనీస్‌ థొరాసిక్‌ సర్జరీ ఎంపిక చేసింది. తొలి థొరాకోస్కోపిక్‌ శస్త్ర చికిత్స చేసిన వారిలో డాక్టర్‌ పళణివేల్‌ ముందజలో ఉన్నారు. తనకు లభించిన ఈ అరుదైన గౌరవం గురించి పళణి వేలు మాట్లాడుతూ ఒక రైతు సర్జన్‌గా మారిన తర్వాత శస్త్రచికిత్సలనే ఒక మార్గంగా తాను చూస్తూ వచ్చినట్టు పేర్కొన్నారు. ల్యాప్రోస్కోపిక్‌ శస్త్ర చికిత్స ప్రధానంగా ఆంకాలజీలో ఫలితాలను మారుస్తుందన్నారు. మరణాలను తగ్గిస్తుందని, గణనీయంగా ఆరోగ్య పరిస్థితిని మెరుగు పరుస్తుందని వివరించారు. తనకు జేఏటీఎస్‌ గుర్తింపు దక్కడం ఎంతో ఆనందంగా ఉందని, త్వరలో జపాన్‌లో ఈ గౌరవాన్ని అందుకోనున్నట్టు ఆయన తెలిపారు.

16వ తేదీ వరకు వర్షాలు

సాక్షి, చైన్నె: ఉపరితల ఆవర్తనం, నైరుతి రుతుపవనాలతో రాష్టంలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈనెల 16వ తేదీ వరకు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. మంగళవారం చైన్నె శివారులోని ఆవడి, పూందమల్లి, పట్టాభిరాం, చైన్నెలోని గిండి, సైదాపేట, విమానాశ్రయం పరిసరాల్లో మోస్తరు వర్షం కురిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement