
కేంద్రమంత్రి ప్రసంగానికి పవర్ కట్
సాక్షి, చైన్నె : పుదుచ్చేరిలో కేంద్ర సమాచార శాఖ సహాయమంత్రి ఎల్.మురుగన్ ప్రసంగానికి పవర్ కట్ సమస్య తప్పలేదు. అది కూడా ఆయన పుదుచ్చేరిని అన్నింటా ఆదర్శంగా తీర్చిదిద్దుతామని వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు ఈ పవర్ కట్ సమస్య ఎదురు కావడం గమనార్హం. కేంద్ర సహాయ మంత్రి ఎల్ మురుగన్ మంగళవారం పుదుచ్చేరిలో పర్యటించారు. ఆ రాష్ట్ర హోం మంత్రి నమశ్శివాయంతోపాటు ముఖ్యనేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పుదుచ్చేరి ప్రగతిపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రాజెక్టులను అమలు చేస్తున్నట్టు తెలిపారు. విద్య, పర్యాటకపరంగా పుదుచ్చేరి ముందుకు దూసుకెళుతోందన్నారు. అలాగే ఒక చిన్న రాష్ట్రం వైద్యహబ్గా మారుతున్నట్టు, మెడికల్ టూరిజంగా సైతం పుదుచ్చేరి ప్రసద్ధి చెందినట్టు తెలిపారు. ఇక్కడ ఏకంగా తొమ్మిదికి పైగా వైద్య విద్యాసంస్థలు, ఆస్పత్రులున్నాయని పేర్కొన్నారు. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం పుదుచ్చేరిని అన్నింటా ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నట్టు ఆయన వ్యాఖ్యానించగా, హఠాత్తుగా పవర్ కట్ సమస్య తప్పలేదు. కాసేపు విద్యుత్ సరఫరా ఆగడంతో మంత్రి మౌనం వహించాల్సి వచ్చింది. అనంతరం విద్యుత్ సరఫరా పునరుద్ధరించడంతో మళ్లీ మీడియా సమావేశం కొనసాగించారు. పుదుచ్చేరి బెస్ట్ అంటూ ఆయన వ్యాఖ్యలు చేస్తుండగా పవర్ కట్ సమస్య రావడాన్ని పలు తమిళ మీడియాలు అస్త్రంగా చేసుకున్నాయి. సామాజిక మాధ్యమాలలో ఇదేనా బెస్ట్ అంటూ చమత్కారాలు హోరెత్తుతున్నాయి.