
బ్రోకోడ్లో నలుగురు హీరోయిన్లు
తమిళసినిమా: ఇటీవల తరచూ వార్తల్లో ఉంటున్న నటుడు రవిమోహన్. ఆయన కథానాయకుడుగాను బిజీగానే ఉన్నారు. తాజాగా నిర్మాతగా అవతారమెత్తడం విశేషం. రవిమోహన్ నిర్మాతగా మారి రవిమోహన్ స్టూడియోస్ పతాకంపై చిత్రాన్ని నిర్మిస్తూ కథానాయకుడిగా నటించనున్నారు. ఇందులో సూర్య మరో ప్రధాన పాత్రను పోషించనున్నారు. ఈ చిత్రానికి డిక్కిలోనా, వడక్కుపట్టి రామస్వామి చిత్రాల ఫేమ్ కార్తీక్యోగి కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. దీనికి బ్రోకోడ్ అనే టైటిల్ను నిర్ణయించారు. కాలైసెల్వన్ శివాజీ చాయాగ్రహణం, యానిమల్, అర్జున్రెడ్డి చిత్రాల ఫేమ్ హర్షవర్దన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర వివరాలను మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో దర్శకుడు పేర్కొంటూ ఈ కథను నటుడు రవి మోహన్కు చెప్పగా ఆయన ఎంతగానో ఆస్వాదించారన్నారు. వెంటనే చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చారన్నారు. ఇది పూర్తి వినోదభరిత కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఇందులో నలుగురు కథానాయికలు నటించనున్నారని వారు ఎవరన్నది త్వరలోనే వెల్లడించనున్నట్లు చెప్పారు. ఈ చిత్రం షూటింగ్ను సెప్టెంబర్లో ప్రారంభించనున్నట్లు చెప్పారు. కాగా ప్రస్తుతం రవిమోహన్ సుధా కొంగర దర్శకత్వంలో పరాశక్తి, గణేష్ కే బాబు దర్శకత్వంలో కరాటే బాబు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. దీంతో ఈయన నిర్మాతగా మారి నిర్మించనున్న చిత్రం పైనా, ఇందులో నటించే ఆ నలుగురు హీరోయిన్లు ఎవరనే విషయం పైనా సర్వత్రా ఆసక్తి నెలకొంది.