
కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా
తిరువళ్లూరు: శ్మశానానికి దారి ఏర్పాటు విషయంలో ఒకే గ్రామానికి చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణ నెలకొన్న క్రమంలో బయట వ్యక్తులు తమపై దాడులకు దిగారని ఆరోపిస్తూ దాదాపు వంద మంది కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. తిరువళ్లూరు జిల్లా తిరువేళాంగాడు యూనియన్ వేణుగోపాలపురం పంచాయతీ పరిధిలో పరేశ్వరం గ్రామం ఉంది. ఈ గ్రామంలో శ్మశానం దారి విషయమై రెండు వర్గాల మధ్య ఘర్షణ జరుగుతోంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఇరువర్గాలు శ్మశాన దారి విషయమై ఘర్షణ పడగా తిరువేళాంగాడు పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఇంత వరకు చర్యలు తీసుకోకపోగా, బయటి వ్యక్తులు కొందరు రాళ్లతో దాడి చేశారని, వారిపై చర్యలు తీసుకోవడంతోపాటు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానికులు కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న తిరువళ్లూరు పోలీసులు ఆందోళనకారులతో చర్చలు జరిపారు. బాధితులకు న్యాయం చేస్తామని హమీ ఇవ్వడంతో ఆందోళన విరమించిన పరేశ్వరం గ్రామానికి చెందిన బాధితులు కలెక్టర్ ప్రతాప్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. కలెక్టర్ సైతం బాధితులకు న్యాయం చేస్తామని హమీ ఇచ్చారు.