
అధిక సీట్లు ఇవ్వాల్సిందే!
– సీపీఎం ప్రధాన కార్యదర్శి షణ్ముగం డిమాండ్
సాక్షి, చైన్నె : సీపీఎం ప్రధాన కార్యదర్శి షణ్ముగం వ్యాఖ్యలు డీఎంకే కూటమిలో మంగళవారం హాట్ టాపిక్గా మారాయి. ఈసారి తమకు అధిక సీట్లు ఇవ్వాల్సిందేనని, ఇందుకు డీఎంకే ముందుకు రా వాలని డిమాండ్ చేయడం చర్చకు దారి తీసింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం ఆరు స్థానాల్లో పోటీ చేసి, రెండు చోట్ల మాత్రమే గెలిచింది. గత ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి గెలిచింది. ఈ పరిస్థితుల్లో 2026 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి నుంచి మరిన్ని సీట్లు రాబట్టాలన్న నిర్ణయానికి సీపీఎం తాజాగా వచ్చేసింది. ఇందుకు అనుగుణంగా మంగళవారం ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షణ్ముగం మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. మళ్లీ అధికారం దిశగా వ్యూహాలకు పదును పెట్టిన డీఎంకేను సీట్ల పేరిట ఇరకాటంలో పెట్టి, తమకు కావాల్సినవి దక్కించుకునే దిశగా కొన్ని పార్టీలు స్వరాన్ని అందుకుంటున్నాయి. ఇప్పటికే వీసీకే తమకు అధిక స్థానాలు అవశ్యం అన్న నినాదం అందుకోగా, ప్రస్తుతం సీపీఎం కూడా అదే బాణీలో పయనిస్తుండటం గమనార్హం. తమకు ఈ సారి ఎన్నికల్లో మరిన్ని అదనపు సీట్లు అవశ్యమని, ఇందుకు డీఎంకే ముందుకు రావాలని, కూటమి పార్టీ కోసం వారి సీట్లను తమకు అప్పగించాలని షణ్ముగం డిమాండ్ చేయడం చర్చనీయాంశంగా మారింది.