
సనాతనం నుంచే తిరుక్కురల్
● గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, చైన్నె : సనాతన ధర్మంలోని ధర్మశాస్త్రం ఆధారంగానే తిరుక్కురల్ రూపుదిద్దుకున్నట్టు గవర్నర్ ఆర్ఎన్ రవి వ్యాఖ్యానించారు. ఇది కాస్త వివాదానికి దారి తీసింది. రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి తరచూ చేస్తూ వస్తున్న వ్యాఖ్యలను డీఎంకే కూటమి పార్టీలు, తమిళాభిమాన సంఘాలు తీవ్రంగా పరిగణిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. సనాతన ధర్మం ప్రచారం అన్నట్టుగా గవర్నర్ ప్రతి వేదికపై చేస్తున్న వ్యాఖ్యలను తప్పుపట్టే వారు తమిళనాట ఎక్కువే. అయినా, గవర్నర్ ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా తమిళులు అత్యంత పవిత్రంగా భావించే తిరుక్కురల్ గ్రంథానికి సన్నాత ధర్మంలోని ధర్మశాస్త్రంతో ముడిపెట్టడం మరింత రచ్చకెక్కింది.
గవర్నర్ ఏమన్నారంటే...
చైన్నె వెస్ట్ మాంబళంలో తిరువళ్లువర్ తిరునాల్ (వేడుక) కార్యక్రమం సోమవారం సాయంత్రం జరిగింది. ఇందులో గవర్నర్ రవి ప్రసంగిస్తూ తిరుక్కురల్ నుంచే జాతీయ విద్యావిధానం ఆవిర్భవించిందన్నారు. తిరుక్కురల్లో పేర్కొన్న అంశాలనే ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్నారని తెలిపారు. తిరుక్కురల్కు ప్రధాని ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం కల్పిస్తున్నారని, ఇందులోని అంశాల నుంచి మూలాధారంగానే జాతీయ విద్యావిధానం ఆవిర్భవించిందని స్పష్టం చేశారు. అదే సమయంలో సనాతన ధర్మం గురించి ప్రస్తావిస్తూ, ఇందులోని ధర్మశాస్త్రం ఆధారంగానే తిరుక్కురల్ రూపొందించినట్టు తెలిపారు. ఈ వ్యాఖ్యలు వివాదానికి దారి తీసిన నేపథ్యంలో మంగళడవారం గవర్నర్ చేసిన ట్విట్ పుండుమీద కారంచల్లినట్లు అయ్యింది. తమిళ మహాకవి తిరువళ్లువర్ తమిళ క్యాలండర్ ప్రకారం వైకాసి అనుషం సందర్భంగా జన్మించినట్టు, అందుకే తిరువళ్లువర్ తిరునాల్ ఉత్సవం జరుపుకుంటున్నట్టు పేర్కొన్నారు. సనాతన ధర్మం, తిరుక్కురల్ ధర్మ శాస్త్రం, నీతి శాస్త్రం సంగమం అని వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ వ్యాఖ్యలను వీసీకే నేత, ఎంపీ తిరుమావళవన్ తీవ్రంగా ఖండించారు. రాజకీయంగా బీజేపీని తమిళనాట బలపరిచే బాధ్యతలను గవర్నర్ తీసుకున్నట్టుందని విమర్శించారు. అందుకే ఆయన ప్రస్తుతం తిరువళ్లువర్కు రంగులు దిద్దే పనిలో పడ్డారని మండిపడ్డారు. ఇదేవిధంగా డీఎంకే కూటమిలోని పలు పార్టీలు గవర్నర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి.