
తిరుత్తణి మపోసీ రోడ్డులో ఆక్రమణల తొలగింపు
తిరుత్తణి: తిరుత్తణి మపోసీ రోడ్డులో వాహన రాకపోకలు, మార్కెట్ దుకాణాలకు అడ్డంగా ఏర్పాటు చేసిన దుకాణాలను మంగళవారం అధికారులు తొలగించారు. తిరుత్తణి బస్టాండ్ సమీపంలోని మపోసీ రోడ్డులో ఇటీవల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నూతనంగా మార్కెట్ నిర్మించారు. ప్రస్తుతం ఆ మార్కెట్లో కూరగాయల వ్యాపారంతోపాటు వివిధ దుకాణాలు ఉంచి వ్యాపారం నిర్వహిస్తున్నారు. అయితే మార్కెట్లో దుకాణాలకు ఎదురుగా హైవే రోడ్డును అక్రమించుకుని రోడ్డు వ్యాపారులు, చిరు దుకాణాలు ఏర్పాటు చేసుకోవడంతో వాహన రాకపోకలతోపాటు, మార్కెట్ వ్యాపారులకు వ్యాపారం దెబ్బతినడంతో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ప్రతాప్ ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం, పోలీసులు, రెవెన్యూ, హైవే శాఖ అధికారుల బృందం సమక్షంలో రోడ్డుపై ఏర్పాటు చేసిన దుకాణాలు తొలగించారు.