
ఐసీఎఫ్లో ఆటోమెటిక్ డోర్ ఈఎంయూ
సాక్షి, చైన్నె : ముంబై స్థానిక రైలు సేవల నిమిత్తం చైన్నె ఐసీఎఫ్లో ఆటోమెటిక్ డోర్లతో కూడిన ఈఎంయూ రైళ్లు తయారు చేయనున్నారు. ఈ వివరాలను మంగళవారం కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. భారతీయ రైల్వేలోనే సరికొత్తగా, అత్యాధునిక పరిజ్ఞానం ఉపయోగించి రైళ్ల తయారీలో ఐసీఎఫ్ దూసుకెళుతున్న విషయం తెలిసిందే. ఐసీఎఫ్ చరిత్రలో ఎన్నో మైలు రాళ్లు చైన్నె నుంచి పట్టాలెక్కాయి. ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీల్లో చైన్నె దేశానికే ఆదర్శంగా నిలుస్తూ, అగ్రస్థానాన్ని దక్కించుకుంటూ వస్తుంది. పలు అత్యాధునిక రైళ్లు, బోగీల నిర్మాణంలో ఐసీఎఫ్ ఘన కీర్తిని చాటుకుంది. స్వదేశీ పరిజ్ఞానంగా ఆధునిక సౌక ర్యాలతో సాగుతున్న ఐసీఎఫ్ నిర్మాణాలన్నీ సంతృప్తికరంగా ఉన్నాయి. వందే భారత్ స్లీపర్ వర్షన్ వరకు అన్నీ ప్రత్యేకత సంతరించుకున్నవే. ఈ పరిస్థితుల్లో ముంబై రైల్వే కోసం ఆటోమెటిక్ డోర్లతో కూడిన ఎలక్ట్రిక్ రైళ్లు చైన్నె ఐసీఎఫ్లో రూపదిద్దుకోనున్నాయి. ముంబైలో ఎలక్ట్రిక్ రైళ్లలో రద్దీ కారణంగా చోటుచేసుకుంటున్న ప్రాణ నష్టాల గురించి తెలిసిందే. సోమవారం కూడా పలువురు రద్దీ కారణంగా రైలు నుంచి పడి మరణించారు. దీంతో ముంబై ఎలక్ట్రిక్ రైళ్ల సేవల కోసం ఆటోమెటిక్ డోర్లతో, గాలి సౌకర్యం పుష్కలంగా ఉండేలా ఎలక్ట్రిక్ రైళ్ల తయారీ పనులను చైన్నె ఐసీఎఫ్కు అప్పగించారు. దీంతో ముంబైకు ఏసీ సౌకర్యం లేకుండా ఆటోమెటిక్ డోర్లతో రైళ్లను తీర్చిదిద్దబోతున్నారు.