
44 ఏళ్ల మహిళకు లంగ్స్ ట్రాన్స్ప్లాంట్
సాక్షి, చైన్నె: అవయవ మార్పిడి విధానం మేరకు రెలా ఆస్పత్రిలో 44ఏళ్ల వయస్సు కలిగిన మహిళకు లంగ్స్ ట్రాన్స్ప్లాంట్ను విజయవంతం చేశారు. ఇద్దరు పిల్లలకు తల్లిగా ఉన్న ఆమెకు కొత్త జీవితాన్ని ప్రసాదించారు. గుండె వైఫల్యం నుంచి ఆమెను రక్షించారు. తేనికి చెందిన కవిత 2009 నుంచి శ్వాస సంబంధిత సమస్యతో బాధ పడుతున్నారు. కృత్రిమ శ్వాస ద్వారా ఆమె కాలం నెట్టుకువచ్చారు. కరోనా తరువాత ఆమె పరిస్థితి దయనీయంగా మారింది. శ్వాస సమస్య మరింత జఠిలం కావడం, కృత్రిమ శ్వాస మరింత ఎక్కువగా అందించాల్సిన పరిస్థితి రావడమే కాకుండా కండరాల బలాన్ని సైతం కోల్పోయారు. చివరకు చైన్నెలోని రెలా ఆస్పత్రికి తరలించారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్తో ఆమె బాధ పడుతున్నట్టు వైద్యులు నిర్ధారించారు. ఇది తీవ్రమైన పల్మనరీ డిజార్డర్గా మారినట్టు తేల్చారు. ఊపిరితిత్తులు, గుండె వైఫల్యానికి పరిస్థితులు దారి తీయడంతో ఆమెను రక్షించేందుకు అవయవ దాత కోసం ఎదురు చూశారు. అదృష్టం కొద్ది బ్రెయిన్ డెడ్ రోగి కుటుంబం ముందుకు రావడంతో ఆమెకు రెండు ఊపిరితిత్తుల మార్పిడిని ఆధునిక విధానంతో విజయవంతం చేశారు. ఎక్మోకు పరిస్థితులు దారి తీయకుండా , గుండె వైఫల్యం కాకుండా పరిరక్షించారు. డబుల్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ ఒక పెద్ద సర్జరీ కావడంతో సుమారు 8 గంటలకు వైద్యులు శ్రమించారు. ఈ సంక్లిష్ట ప్రక్రియను పర్యవేక్షించడానికి హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ డైరెక్టర్, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ శ్రీనాథ్ విజయశేఖరన్, క్లినికల్ లీడ్ ట్రానన్స్ప్లాంట్ పల్మోనాలజీ డాక్టర్ ఐశ్వర్య రాజ్కుమార్ నేతృత్వంలోని 30 మంది సభ్యుల బృందం శ్రమించింది. శస్త్రచికిత్స అనంతరం సంరక్షణ కూడా అంతే క్లిష్టమైన సవాలుతో కూడుకోవడంతో పాటుగా కండరాల బలాన్ని తిరిగి పొందేందుకు గాను ప్రత్యేక చికిత్సలు అందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యవంతురాలు కావడంతో ఈ వివరాలను సోమవారం రెలా చైర్మన్ డాక్టర్ మహ్మద్ రెలా నేతృత్వంలో మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా డాక్టర్ రెలా మాట్లాడుతూ ప్రాణం కాపాడే ఈ ఎంపిక ఉందని మొదట్లో రోగి కుటుంబానికి తెలియదని, అందుకే కొన్ని సంవత్సరాల పాటుగా ఆక్సిజన్తో కాలం నెట్టుకొచ్చారని తెలిపారు. రోగికి రెండు ఊపిరితిత్తుల మార్పిడిని విజయవంతంగా నిర్వహించడం చాలా తృప్తికరంగా జరిగిందన్నారు.