
మామిడి రైతులను ఆదుకోవాలి
వేలూరు: తమిళనాడులోని మామిడి రైతులను ప్ర భుత్వం ఆదుకోవాలని తమిళనాడు మామిడి రైతు ల సంఘం ఆధ్వర్యంలో రైతులు కలెక్టర్ సుబ్బలక్ష్మి వినతి పత్రం అందజేశారు. సోమవారం ఉదయం వేలూరు కలెక్టరేట్లో గ్రీవెన్సెల్ జరిగింది. ఇందులో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు వివిధ సమస్యలపై వినతిపత్రాలు సమర్పించుకున్నారు. వినతి పత్రాలను స్వీకరించిన కలెక్టర్ సంబంధిత అధికారులకు అందజేసి, వెంటనే విచారణ జరిపి సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలోని మామిడి జ్యూస్ ఫ్యాక్టరీలకు వేలూరు, కాట్పాడి, పరదరామి, కన్నియంబాడి, అనకట్టు, పేర్నంబట్టు, గుడియాత్తం తదితర ప్రాంతాల్లో పండించే మామిడిని విక్రయం చేసుకునే వారని, ప్రస్తుతం మామిడికి గిట్టుబాటు ధరలు లేక పోవడంతో మామిడి జ్యూస్ ఫ్యాక్టరీలు అతి తక్కువ ధరకు విక్రయించాల్సి వస్తుందని తమిళనాడు మామిడి రైతుల సంఘం ఆధ్వర్యంలో అందజేసిన వినతిపత్రంలో పేర్కొ న్నారు. మామిడికి గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆంధ్ర తరహాలో ఒక టన్ను మామిడికి ప్రభుత్వం ఇస్తున్న రూ.4 వేలను తమిళనాడు ప్రభుత్వం అందజేసి రైతులను ఆదుకోవాలని కోరారు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి తమిళనాడు రైతులు పండించిన మామిడిని కొనుగోలు చేసేలా చర్చలు జరిపి రైతులకు న్యాయం చేయాలని కోరారు. వినతిని స్వీకరించిన కలెక్టర్ ప్రభుత్వానికి సిఫారసు చేసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.