
50 సీట్లు లక్ష్యం
● అమిత్ షా వ్యూహం
● మళ్లీ జూలైలో పర్యటన
● ఆరోపణలపై డీఎంకే ఎదురు దాడి
సాక్షి, చైన్నె : అన్నాడీఎంకే కూటమిలో 50 సీట్లను రాబట్టుకుని, వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టేలా బీజేపీ వర్గాలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా దిశా నిర్ధేశం చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఆ యాభై స్థానాల్లో కార్యక్రమాలు ఇక వేగవంతం చేయడమే కాకుండా, జూలైలో మరోమారు రాష్ట్ర పర్యటనకు ఆయన విచ్చేయాలని నిర్ణయించినట్టు సమాచారాలు వెలువడ్డాయి. ఈ ఏడాదిలో నెలకు ఒక పర్యాయం అమిత్ షా తమిళనాడుకు వచ్చి వెళుతున్న విషయం తెలిసిందే. మే నెలలో మాత్రం విరామం ఇచ్చినా జూన్ నెల పర్యటనగా గత రెండు రోజులు మదురైలో తిష్ట వేశారు. బీజేపీ సెంట్రల్ కమిటీతో భేటీ అయ్యారు. ఈ భేటీ అంతా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పట్టున్న అసెంబ్లీ స్థానాలపై దృష్టి పెట్ట సాగింది. అలాగే, ఒత్తకడై బహిరంగ సభ వేదికగా అమిత్ షా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. డీఎంకేను టార్గెట్ చేస్తూ, ఆయన తీవ్రంగానే విరుచుకు పడ్డారు. ఈ సభ అనంతరం ఢిల్లీ వెళుతూ ఆయన ఆదివారం రాత్రి పార్టీ వర్గాలతో మరో మారు చర్చించి, 50 స్థానాల్లో కార్యక్రమాలు వేగవంతం చేయాలని ఆదేశించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. 50 స్థానాలలో పోటీ చేసి, విజయం సాధిస్తే, అధికారంలో వాటాకు సైతం అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గుర్తెరిగి పని చేయాలని పార్టీ వర్గాలకు సూచించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. జూలై పర్యటనకు వచ్చేలోపు ఆ యాబై స్థానాల జాబితాను సిద్ధం చేసి ఉంచాలని ఆదేశించినట్టు సమాచారం.
డీఎంకే ఎదురు దాడి
బహిరంగ సభ వేదికగా అమిత్ షా తమను టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలను డీఎంకే తీవ్రంగా పరిగణించింది. డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ రాజ మాట్లాడుతూ అమిత్షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించడమే కాకుండా, బాధ్యత గల హోం మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి సరైన అవగాహన, ఆధారాలు లేకుండా నోటికి వచ్చినట్టు వాగి వెళ్లడం శోచనీయమని విమర్శించారు. మత రాజకీయాలు, విభిన్న వర్గాల మధ్య చిచ్చు పెట్టే కుట్రలతో బీజేపీ పయనం ఉన్నట్లు స్పష్టమవుతోందని ఆరోపించారు. డీఎంకేను చూసి పీఎం మోదీ, మంత్రి అమిత్ షా భయపడుతున్నారని, అందుకే తమిళనాడులో పాగా వేయడానికి విశ్వ ప్రయత్నాలతో, దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రం శాంతి వనంగా ఉంటే, శాంతి భద్రతలు విచ్ఛిన్నమైనట్టుగా ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. తమిళనాడులో ఎన్నికల కుట్రలు, వ్యూహాలకు పదును పెట్టినా, బీజేపీని నమ్మే స్థితిలో ఇక్కడి ప్రజలు లేరన్నారు. తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై మాట్లాడుతూ అమిత్ షా పాచికలు తమిళనాట పారబోవన్నారు. ఇది వరకు ఎదురైన పరాభావాలు మళ్లీ మళ్లీ వారికి పునరావృతం కావడం తథ్యమన్నారు.