హరోం..హర..! | - | Sakshi
Sakshi News home page

హరోం..హర..!

Jun 10 2025 3:36 AM | Updated on Jun 10 2025 3:36 AM

హరోం.

హరోం..హర..!

తిరుచెందూరులో భక్త జనంసందోహం

సాక్షి, చైన్నె : వైఖాసి విశాఖం సందర్భంగా తమిళనాడులోని సుబ్రమణ్యస్వామి ఆలయాలు హరోం హర నామస్మరణతో మార్మోగాయి. తమిల్‌ కడవుల్‌ మురుగన్‌ను ధ్యానిస్తూ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ప్రసిద్ధి చెందిన తిరుచెందూరు, పళనిల్లోని ఆలయాల్లో మహోత్సవం మిన్నంటింది. తమిళ్‌ కడవుల్‌ (తమిళ దేవుడు) మురుగన్‌. ఆరుపడ వీడుల్లో ప్రసిద్ధి చెందిన మురుగన్‌ ఆలయాలు రాష్ట్రంలోనే ఉన్నాయి. ఇందులో తిరుత్తణి, తిరుచెందూరు, పళని ప్రసిద్ధి చెందిన ఆలయాలు. ఈ ఆరుపడై వీడులలో తైపూసం, స్కంధ షష్టి ఉత్సవాలతోపాటుగా వైఖాస విశాఖ ఉత్సవాలు అత్యంత వేడుకగా జరుగుతాయి. తమ ఆరాధ్య దైవాన్ని తమిళులు సోమవారం దర్శించుకుని పునీతులయ్యారు. భక్తులతో మురుగన్‌ ఆలయాలు కిట కిటలాడాయి. అన్ని ఆలయాల్లో హరోం హర నామం మిన్నంటింది. ప్రసిద్ధి చెందిన తిరుచెందూరు సుబ్రమణ్య స్వామి ఆలయంలో వేకువ జామున ఒంటి గంట నుంచే పూజాది కార్యక్రమాలు మొదలయ్యాయి. 1.30 గంటలకు విశ్వ రూప దర్శనం, ఆరు గంటలకు ఉదయ మార్తాండ అభిషేకం పూజలు జరిగాయి. వేలాదిగా భక్తులు తరలి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ పరిసరాలు భక్తి భావంలో మునిగాయి. సముద్ర తీరంలో స్నానం చేసిన భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. సముద్ర తీరంలో జనం రద్దీ పెరగడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం గట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది. దిండుగల్‌ జిల్లా పళనిలో దండాయుధ పాణి స్వామి ఆలయంలో ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.చైన్నెలోని వడ పళని మురుగన్‌ ఆలయం భక్తులతో కిట కిటలాడింది. సిరువాపురి మురుగన్‌ ఆలయాన్ని రాష్ట్రగవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

హరోం..హర..! 1
1/1

హరోం..హర..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement