
పాలిటెక్నిక్ విద్యార్థులకు ప్రత్యేక సప్లిమెంటరీ
మంత్రి కోవి చెలియన్
సాక్షి, చైన్నె : పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులకు ప్రత్యేక సప్లిమెంటరీ పరీక్ష నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామని ఉన్నత విద్యాశాఖ మంత్రి కోవి చెలియన్ ప్రకటించారు. పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు తమ జీవితంలో తదుపరి స్థాయికి వెళ్లేందుకు, జీవితంలో పురోగతి సాధించాలన్న కాంక్షతో రెండో సంవత్సరం విద్యార్థులకు ప్రత్యేక సప్లిమెంటరీ పరీక్ష నిర్వహించేలా చర్యలు తీసుకున్నామన్నారు. వివిధ సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించని పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు జూన్ లేదా జూలై – 2025 స్పెషల్ సప్లిమెంటరీ పరీక్షను నిర్వహించనున్నామని ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పరీక్ష టైం టేబుల్ను సోమవారం విడుదల చేశారు. విద్య నాణ్యతను మెరుగుపరచడం లక్ష్యంగా ఏప్రిల్– 2025లో జరిగిన డిప్లొమా పరీక్షల చివరి సెమిస్టర్, సబ్–సెమిస్టర్ పరీక్ష రాసిన పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు కొన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులయ్యారని, మరికొన్ని సబ్జెక్టులు తప్పినట్టు తెలిపారు. వీరు తదుపరి స్థాయి ఉన్నత విద్యలో ప్రవేశంచ లేని పరిస్థితి ఉందని, దీనిని దృష్టిలో ఉంచుకుని ఇక ప్రత్యేక సప్లిమెంటరీ నిర్వహించాలని నిర్ణయించామన్నారు. సప్లిమెంటరీ పరీక్షలో పెండింగ్ సబ్జెక్టులను విద్యార్థులకు రాసుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించిన అన్ని వివరాలు htt pr://-d-t-e.t n.g-o-v.i n లో అందుబాటులో ఉన్నాయని, విద్యార్థులు త్వరితగతిన నమోదు చేసుకోవాలని సూచించారు.
ప్రత్యేక సప్లిమెంటరీ
స్పెషల్ సప్లిమెంటరీ పరీక్షలు, దరఖాస్తు టైమ్టేబుల్ను విడుదల చేశారు. ఈనెల 18వ తేదీలోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. 23వ తేదీన హాల్ టికెట్లను అందజేయనున్నామన్నారు. ఈనెల 25వ తేదిన థియరీ పరీక్షలు జరుగుతాయని, ఈ నెల 30 నుంచి జూలై 16వ తేదీ వరకు ప్రాక్టికల్స్, జూలై 17 నుంచి 25వ తేదీ వరకు ఇతర సబ్జెక్టుల పరీక్షలు, 30వ తేదీన సప్లిపెంటరీ ఫలితాలను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.