
చంద్రప్రభపై గోవిందుడి వైభవం
తిరుపతి కల్చరల్: శ్రీగోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజైన ఆదివారం రాత్రి చంద్రప్రభ వాహనంపై వెన్నకృష్ణుడి అలంకరణలో కొలువై ఊరేగుతూ శ్రీగోవిందరాజస్వామి భక్తులను కనువిందు చేశారు. మంగళవాయిద్యాలు, భక్తజన బృందాల కోలాటాలు, భజనల మధ్య స్వామివారి చంద్రప్రభ వాహన సేవ కోలాహలంగా సాగింది. దీనికి ముందు ఉదయం 7 నుంచి 9 గంటల వరకు స్వామి వారు సూర్యప్రభ వాహనాన్ని అధిరోహించి విహరిస్తూ భక్తులను కటాక్షించారు. కార్యక్రమంలో పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఎఫ్ఏఅండ్ సీఏఓ బాలాజీ, డెప్యూటీ ఈఓ వీఆర్ శాంతి, ఏఈఓ మునికృష్ణారెడ్డి, పలువురు శ్రీవారి సేవకులు, భక్తులు పాల్గొన్నారు.
నేడు రథోత్సవం
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు సోమవారం స్వామివారి రథోత్సవం వైభవంగా జరుగనుంది. ఉదయం 6.15 గంటల నుంచి రథంపై స్వామివారు కొలువై ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరిస్తారు. అలాగే రాత్రి 7 గంటలకు అశ్వవాహనంపై స్వామివారు విహరిస్తూ భక్తులను కటాక్షించనున్నారు.

చంద్రప్రభపై గోవిందుడి వైభవం