
వేల్ మురుగన్కుహరోహర
– కోలాహలంగా మహాకుంభాభిషేకం
వేలూరు: వేలూరు సమీపంలోని పుదువసూరు గ్రామంలో తీర్థగిరి కొండపై వెలసిన వడివేల్ సుబ్రహ్మణ్యస్వామి ఆలయ కుంభాభిషేకం ఆదివారం ఉదయం కోలాహలంగా జరిగింది. ఆలయ ముందు భాగంలో కొండపై 92 అడుగుల ఎత్తైన మురుగన్ విగ్రహాన్ని నిర్మించారు. విగ్రహాన్ని మలేషియాలోని బతిమలై మురుగన్ విగ్రహాన్ని నిర్మించిన తిరువావూరు శిల్పి రూపొందించారు. ఉత్తర, దక్షణ దిశకు ఎదురుగా ఉన్న ఈ మురుగన్ విగ్రహం కొండపై ఉండడంతో వేలూరు పట్టణం పూర్తిగా కనిపించే విధంగా కనిపిస్తుంది. విగ్రహనికి కుంభాభిషేకం నిర్వహించేందుకు మూడు హెలికాప్టర్లను రప్పించి విగ్రహంపై పుష్పాలు, పుణ్యజలాలను చల్లడంతో భక్తులు హరోహరా నామస్మరణలతో కొండ పూర్తిగా పులకించిపోయింది. కుంభాభిషేకం పురస్కరించుకుని యాగశాల పూజలు, మహాగణపతి హోమం, మంగళ వాయిద్యాలతో కూడిన వేద మంత్రాలు చదివి అష్టబంధన, దీపారాధన పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థగిరి మురుగన్కు, కుంభాభిషేకం, మూలవర్ పరివార దేవతలకు కుంభాభిషేకం జరిగింది. ఈ సందర్భంగా మధ్యాహ్నం భక్తులకు అన్నదానం చేశారు. సాయంత్రం స్వర్ణ కర్త గంగై అమరన్ బృందంచే సంగీత ప్రదర్శన జరిగింది. రాత్రి స్వామి వారిని భక్తుల దర్శనార్థం ఊరేగించారు. ఆలయ ట్రస్ట్బోర్డు చైర్మన్ శ్రీనివాసన్, వెంకటాపురం సర్పంచ్ బాబు, మాజీ చైర్మన్ శివకుమార్, ట్రస్ట్ ఉపాధ్యక్షుడు ఏలుమలై, రవికుమార్, సభ్యులు పయణి, కరుణాకరన్, పుదియనీది పార్టీ అధ్యక్షుడు ఏసీ షణ్మగం పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఈ విగ్రహం ప్రపంచంలోనే మూడవ ఎత్తైన మురుగన్ విగ్రహమని ఆలయ నిర్వాహకులు తెలిపారు.