
పెరిగిన విదేశీ రోగుల సంఖ్య
– ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణియన్
సాక్షి,చైన్నె: రాష్ట్రంలో వైద్యచికిత్సల నిమిత్తం విదేశీ రోగుల సంఖ్య పెరిగిందని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణియన్ తెలిపారు. చైన్నె టీ.నగర్ పాండిబజార్లో అట్లాంటిస్ హెల్త్ సిటీ నేతృత్వంలో మల్లీ స్పెషాలిటీ ఈ ఆస్ప త్రిని ఏర్పాటు చేశారు. దీనిని ఆదివారం ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణియన్ ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ సేవలు చైన్నెలో అందుబాటులోకి వచ్చాయని వివరించారు. ఆమేరకు అనేక ఆస్పత్రుల్లో వైద్యపరంగా సేవలు విస్తృతమయ్యాయని పేర్కొన్నారు. అట్లాంటిస్ హెల్త్ సిటీ ఆరోగ్యసంక్షణ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దినట్టు వివరించారు. 24 గంటల పాటు ఇక్కడ వైద్యసేవలు అందించేందుకు వైద్య నిపుణులు సిద్ధంగా ఉన్నారన్నారు. ఆరోగ్య సంరక్షణ లక్ష్యంగా ఈ ప్రయాణంలో మరో మైలురాయిగా తిరుప్పూర్, చైన్నె ట్రిప్లికేన్లోనూ అట్లాంటిస్ హెల్త్ సిటీ సేవలకు చర్యలు తీసుకోవడం ఆహ్వానిస్తున్నామన్నారు. గత గణాంకాలను చూస్తే 25 శాతం విదేశీ రోగుతమిళనాడుకు వస్తున్నట్టు స్పష్టం అవుతున్నట్టు పేర్కొన్నారు.
త్వరలో పొత్తు నిర్ణయం
సాక్షి, చైన్నె : తమిళనాడులో ఎవరితో పొత్తు అన్నది రెండు లేదా మూడు నెలల్లో తాము స్పష్టతకు వస్తామని పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు అన్నారు. పీఎంకేలో విభేదాల నేపథ్యంలో ఆదివారం ఆయన చైన్నెలో మీడియాతో మాట్లాడారు. ఎవరితో, ఎందుకు, ఎప్పుడు, ఎలా కూటమి అన్న విషయాన్ని స్పష్టం చేయడానికి కసరత్తులు చేస్తున్నామన్నారు. ఇందుకోసం రెండు లేదా మూడు నెలల సమయం పడుతుందన్నారు. అప్పుడే కూటమిపై స్పష్టతను తెలియజేస్తామన్నారు. కూటమి జాతీయ పార్టీతోనా లేదా రాష్ట్ట్రియ పార్టీతోనా అనేది తెలియజేస్తామన్నారు. ఇప్పటికిప్పుడే కూటమి గురించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఇదిలాఉండగా బీజేపీకి అత్యంత సన్నిహితంగా ఉన్న ఆడిటర్ గురుమూర్తి, రాందాసుతో భేటీ కావడం చర్చకు దారి తీసింది. విభేదాలను పక్కనపెట్టి ముందుకు సాగాలని బలోపేతం దిశగా అడుగులు వేయాలని రాందాసుకు గురుమూర్తి హితవు పలికినట్టు సమాచారం. ఇదిలాఉండగా రెండు రోజుల క్రితం రాందాసుతో గురుమూర్తి తైలాపురంలో భేటీ కావడం గమనార్హం.
దుబాయ్ విమానంలో
సాంకేతిక లోపం
– తప్పిన పెనుప్రమాదం
కొరుక్కుపేట: చైన్నె నుంచి దుబాయ్ వెళుతున్న విమానంలో సాంకేతిక లోపం ఏర్పడడంతో రన్వేపైనే దూసుకెళ్లింది. దీంతో పైలట్ చాకచక్యంతో రన్వేపై ఆపి వేయడంతో దుబాయ్కు వెళ్లాల్సిన 312 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఆదివారం ఉదయం 9.50 గంటలకు చైన్నె అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దుబాయ్ వెళ్లాల్సిన ఎమిరేట్స్ విమానం బయలుదేరింది. అందులో 312 మంది ప్రయాణికులు, 14 మంది సిబ్బంది ఉన్నారు. విమానం స్టాండ్ నుంచి డి–1 ప్రాంతానికి రన్వే పై దూసుకుపోవడంతో విమానం ఇంజిన్లో సమస్య తలెత్తిందని పైలట్ గుర్తించాడు. పైలట్ వెంటనే విమానాన్ని ట్యాక్సీవే పై ఆపి చైన్నె విమానాశ్రయ కంట్రోల్రూమ్కు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న సిబ్బంది మరమ్మతులు చేశారు. ఈ సంఘటన చైన్నె విమానాశ్రయంలో తీవ్ర కలకలం రేపింది.
మహిళ అవయవాలు దానం
వేలూరు: తిరుపత్తూరు జిల్లా ఆంబూరు సమీపంలోని మారియమ్మన్ ఆలయ వీధికి చెందిన ఎత్తిరాజులు భార్య ఉషారాణి(58). ఈనెల 6వ తేదీన ఆంబూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈమె తలకు తీవ్ర గాయమైంది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను ఆంబూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం రాణిపేటలోని సీఎంసీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ఉషారాణికి ఆదివారం ఉదయం బ్రెయిన్డెడ్ అయ్యింది. దీంతో ఆమె అవయవాలను దానం చేసేందుకు కుటుంబసభ్యులు ముందుకొచ్చారు. దీంతో ఆమె అవయవాలను వేలూరు సీఎంసీ, రాణిపేట సీఎంసీ ఆస్పత్రితో పాటు చైన్నెలోని ప్రశాంత్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి అందజేసినట్లు సీఎంసీ ఆస్పత్రి పీఆర్ఓ ఒక ప్రకటనలో తెలిపారు.

పెరిగిన విదేశీ రోగుల సంఖ్య

పెరిగిన విదేశీ రోగుల సంఖ్య