
కూటమిలోకి మరిన్ని పార్టీలు
సాక్షి,చైన్నె: 2026 ఎన్నికల సమయానికి అన్నాడీఎంకే కూటమిలోకి మరిన్ని పార్టీలు చేరనున్నాయని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పళనిస్వామి స్పష్టం చేశారు. ఆదివారం అరక్కోణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అన్నాడీఎంకే హయాంలో రాష్ట్రంలో కొత్తగా 11 ఆస్పత్రుల, వైద్యకళాశాలలను తీసుకొచ్చామని వివరించారు. తాము అమలు చేసిన పథకాలను డీఎంకే ప్రభుత్వ తుంగలో తొక్కినట్టు గుర్తుచేశారు. మరికొన్ని పథకాలకు పేర్ల మార్పుచేశారని పేర్కొన్నారు. ప్రజలను మభ్యపెట్టే దిశగా ప్రజావ్యతిరేక పాలన రాష్ట్రంలో సాగుతున్నట్టు ఆరోపించారు. సామాన్యుల కోసం తాము ఎన్నో పథకాలను తీసుకొస్తే, ప్రస్తుత పాలకులు వాటిని సంపన్నులకు ప్రయోజనకరంగా మార్చేశారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో అన్నాడీఎంకే అధికారంలోకి రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని, ఇది కార్యరూపంలోకి రావడం తథ్యమని, మరిన్ని పార్టీలు ఎన్నికల సమయానికి తమ కూటమిలోకి చేరడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.