
బూత్కు 30 శాతం ఓటర్ల నమోదు లక్ష్యం
● సభ్యత్వ నమోదుపై స్టాలిన్ ● ఎన్నికల పనుల వేగానికి ఆదేశాలు ● జిల్లాల నేతలతో కాన్ఫరెన్స్
సాక్షి, చైన్నె : ఒక పోలింగ్ బూత్కు 30 శాతం ఓటర్లు డీఎంకే సభ్యులుగా ఉండే రీతిలో నమోదు ప్రక్రియ సాగాలని పార్టీ వర్గాలకు సీఎం స్టాలిన్ ఆదేశించారు. సభ్యత్వ నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఇంటింటా వెళ్లి ప్రజలతో మమేకం కావాలని సూచించారు. 2026 ఎన్నికల్లో మళ్లీ అధికారమే లక్ష్యంగా సీఎం, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ వ్యూహాలకు పదును పెట్టిన పెట్టిన విషయం తెలిసిందే. పార్టీ వర్గాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ, వారి ద్వారా కార్యక్రమాలు విస్తృతం చేయిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో 200 స్థానాలలో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా నిర్ణయించారు. ఈ పరిస్థితుల్లో వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో ఎన్నికలు జరుగుతాయన్న సమాచారం వెలువడుతున్న నేపథ్యంలో కార్యక్రమాలను మరింత వేగవంతం చేయించేందుకు సిద్ధమయ్యారు. మదురైలో జరిగిన పార్టీ సర్వ సభ్య సమావేశంలో సభ్యత్వ నమోదు గురించి ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అలాగే, పార్టీ అనుబంధ విభాగాల్లో కొత్తగా మరో రెండింటిని ఏర్పాటు చేయడానికి స్టాలిన్ నిర్ణయించారు.
నేతలతో భేటీ
సభ్యత్వ నమోదు, అనుబంధ విభాగాల పనితీరును మరింత వేగవంతం చేయించడం, పార్టీ నేతలు, ముఖ్యులు ఇంటింటా వెళ్లి ప్రజలతో మమేకం అయ్యే దిశగా శనివారం డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ జిల్లాల కార్యదర్శులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, నియోజకవర్గ పర్యవేక్షకులు ఈ సమావేశానికి తమ తమ నివాసాలు, కార్యాలయాల నుంచి హాజరయ్యారు. చైన్నెలోని తన నివాసం నుంచి సీఎం స్టాలిన్ సమావేశమయ్యారు. పార్టీ నిర్వాహక కార్యదర్శి ఆర్ఎస్ భారతీ పార్టీ కార్యాలయం నుంచి సమావేశానికి హాజరైన వారి వివరాలను అధ్యక్షుడు స్టాలిన్ దృష్టికి తీసుకొస్తూ స్వాగతోపన్యాసం చేశారు. జిల్లా, నియోజకవర్గాల వారీగా బూత్ కమిటీల పనితీరు, సభ్యత్వ నమోదు గురించి ముందుగా చర్చించారు. ఒక్కో పోలింగ్ బూత్లో 30 శాతం ఓటర్లు డీఎంకేలో సభ్యులుగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా స్టాలిన్ ఆదేశించారు. గతంలో సభ్యత్వ నమోదును విజయవంతం చేసి ఉన్నారని గుర్తుచేస్తూ, దీనిని తలదన్నే రీతిలో సభ్యత్వ నమోదు తాజాగా జరగాలని ఆదేశించారు. ప్రతి నేత, ముఖ్య ప్రముఖులు ఇంటింటా వెళ్లి ప్రజలతో మమేకం కావాలని ఆదేశించారు. బూత్ కమిటీలు మరింత అలర్ట్గా ఉండాలని, స్థానికంగా ఉన్న ప్రజలను తరచూ కలుస్తూ ప్రభుత్వ పరంగా వారికి కావాల్సిన సహకారం అందించాలని, ప్రభుత్వ పథకాలు దరిచేరాయా.? అని ఆరా తీయడం, అవసరమైతే దగ్గరుండి పనులు చేయించాలని, పథకాలు రాని వారినికి దరిచేర్చాలని సూచించారు. ఇంటింటికీ తరచూ వెళ్లడం, ప్రజలకు స్థానికంగా అందుబాటులో ఉండడం బాధ్యతగా స్వీకరించాలని సూచించారు. ఒక్కో పోలింగ్ బూత్లో కనీసం 30 శాతం ఓటర్లు డీఎంకేలో సభ్యులుగా ఉండేలా సభ్యత్వ నమోదు జరగాలని, పనుల వేగం పెంచాలని ఆదేశించారు.