
క్లుప్తంగా
నేపాలి మహిళ ఆత్మహత్య
అన్నానగర్: కుటుంబ కలహాలతో ఓ నేపాలి మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. చైన్నెకు చెందిన అర్జీన్ బహదూర్ (33) నేపాలి. ఇతను ఆ ప్రాంతంలోని ఫాస్ట్ఫుడ్ సెంటర్లో పనిచేస్తున్నాడు. ఇతని భార్య రీటాదేవి (29). వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. రీటాదేవి మద్యం తాగడం అలవాటు ఉండడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈక్రమంలో శుక్రవారం మద్యం తాగిన రీటాదేవి, ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కీల్పాకం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రాణం తీసిన రోలర్
అన్నానగర్: రోడ్డు రోలర్ కిందపడి ఓ ఇంజినీర్ మృతి చెందాడు. మదురైలోని మేలమడై జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. విరుదునగర్ జిల్లా కారియాపట్టి దులుక్కన్కులం గ్రామానికి చెందిన కరుప్పసామి (28) ఇక్కడ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. శనివారం ఉదయం కరుప్పసామి యథావిధిగా పనికి వచ్చాడు. ఆసమయంలో ఎండ ఎక్కువగా ఉండడంతో అక్కడ నిలిపి ఉన్న రోడ్డు రోలర్ కింద కరుప్పసామి కూర్చున్నాడు. ఈక్రమంలో అసోం రాష్ట్రానికి చెందిన ఆపరేటర్ రెహమాన్ రోడ్డురోలర్ను కదిలించాడు. దాని కింద ఉన్న కరుప్పసామి తల ను జ్జునుజ్జయి దుర్మరణం పాలయ్యాడు. విష యం తెలిసి మాట్టుతవాని పోలీసులు సంఘట న స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారు. ప్రమా దానికి కారణమైన ఆపరేటర్ రెహమాన్ తెప్పకుళం పోలీసులకు లొంగిపోయాడు. మృతుడు కరుప్పసామికి ఇంకా వివాహం కాలేదు.
సెల్ కొనివ్వలేదని
బాలిక బలవన్మరణం
తిరువళ్లూరు: తల్లిదండ్రులు కొత్త సెల్ఫోన్ కొనివ్వలేదని ఓ బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ కొప్పూరు గ్రామానికి చెందిన చంద్రన్. ఇతను భవన నిర్మాణ రంగంలో కార్మికుడు. ఈక్రమంలో ఇతని కుమార్తె దివ్యదర్శిని(15). ఈమె మనవాలనగర్లోని ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఈక్రమంలో దివ్యదర్శిని సెల్ఫోన్ కొనివ్వాలని తల్లిదండ్రులను కో రింది. తల్లిదండ్రులు నిరాకరించడంతో మనస్తా పం చెంది ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆలస్యంగా గుర్తించిన బంధువులు ఉరికి వేలాడుతున్న బాలికను కిందకు దింపి వైద్యశాలకు తరలించారు. అక్కడ వైద్యులు బాలికను పరిశీలించగా అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మనవాలనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును చేపట్టారు.
12న కొత్త టోల్ గేట్ ప్రారంభం
కొరుక్కుపేట: తంజావూరు జిల్లా కుంభకోణం సమీపంలోని తంజావూరు–విక్రవాండి జాతీయ రహదారిపై కుంభకోణం సమీపంలోని మనంబాడి వద్ద కొత్తగా నిర్మించిన టోల్ ప్లాజాను ఈ నెల 12వ తేదీన ప్రారంభించనున్నారు. తంజావూరు–విక్రవాండి జాతీయ రహదారి నిర్మా ణం మూడు విభాగాలుగా జరుగుతోంది. విక్రవాండి నుంచి సేథియాథోపు వరకు, సేథియాథోపు నుంచి చోళపురం వరకు, చోళపురం నుంచి తంజావూరు వరకు సాగుతుంది. మొదటి దశలో హైవేలోని చోళపురం–కుంభకోణం–తంజావూరు విభాగం పూర్తయింది. ఇది జనవరి 20న ప్రారంభమైంది. చోళపురం నుంచి సేథియాతోపు వరకు 50 కిలోమీటర్ల పొడవైన హైవే రెండో దశ పూర్తయింది. దీని తరువాత నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా దీనిని ప్రజల ఉపయోగం కోసం తెరవాలని నిర్ణయించింది. దీని ప్రకారం, చోళపురం–సేథియాతోపు మార్గానికి టోల్ వసూలు చే యడానికి మనంపాడి వద్ద టోల్ బూత్ ఏర్పాటు చేశారు. దీన్ని 12వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్ల నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. తమిళనాడులో ప్రస్తుతం 52 టోల్ బూత్లు పనిచేస్తున్నాయి. మనంబాడి టోల్ బూత్ కూడా ప్రారంభమైతే, మొత్తం సంఖ్య 53కి పెరుగుతుందని అధికారులు వెల్లడించారు.
సుసి ఈము పౌల్ట్రీ కంపెనీ సీఈఓకు పదేళ్ల జైలు
–రూ.7 కోట్ల జరిమానా
కొరుక్కుపేట: తమిళనాడుతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన 385 మంది పెట్టుబడిదారుల నుంచి రూ.కోట్లు వసూలు చేసి మోసం చేసినందుకు సుసి ఎముకోజి కంపెనీ యజమాని గురుస్వామికి పదేళ్లు జైలుశిక్ష , రూ.7 కోట్ల జరిమానా విధిస్తూ కోయంబత్తూరు కోర్టు తీర్పు చెప్పింది. వివరాల్లోకి వెళితే.. 2010లో ఈరోడ్ జిల్లాలోని పెరుందురైలో ప్రధాన కార్యాలయం కలిగిన సుసి ఈము ఫామ్స్ అనే కంపెనీ, ఆస్ట్రేలియన్ పక్షి అయిన ఈము కోళ్లను పెంపకంతో భారీ లాభాలు ఆర్జించవచ్చని పేర్కొంటూ ఒక ఆకర్షణీయమైన ప్రకటన చేసింది. దీనిని నమ్మి, తమిళనాడు నుంచి మాత్రమే కాకుండా పొరుగు రాష్ట్రాలకు చెందిన వేలాది మంది ఆ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. అయితే ఆ కంపెనీ హామీ ఇచ్చినట్లుగా పెట్టుబడిదారులకు డబ్బు తిరిగి ఇవ్వలేదు. వారి నుంచి రూ.కోట్లు వసూలు చేసి, మోసం చేసింది. దీనిపై 10 కేసులు కొనసాగుతున్నాయి. ఇందులో 385 మంది నుంచి డబ్బు తీసుకుని మోసం చేసినందుకు సేలంలో నమోదైన కేసు శుక్రవారం కోయంబత్తూరు ఇన్వెస్టర్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ కోర్టులో విచారణకు వచ్చింది. ఈ కేసులో సుసి ఈము ఫామ్ యజమాని గురుస్వామికి పదేళ్లు జైలుశిక్షతోపాటు రూ.7.89 కోట్ల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. అప్పీలు గడువు ముగిసిన తర్వాత ఈ జరిమానా మొత్తాన్ని 385 మంది పెట్టుబడుదారులకు పంచాలని కోర్టు ఆదేశించింది.