
తిరుక్కురళ్ ఆడియో ఆవిష్కరణ
తమిళసినిమా: ఇంతకుముందు కామరాజర్ జీవిత చరిత్రతో కామరాజ్, మహాత్మగాంధీ జీవిత చరిత్రతో వెల్కమ్ బ్యాక్ గాంధీ వంటి చిత్రాలను రూపొందించిన ఏజే.బాలకృష్ణన్ తాజాగా స్వీయదర్శకత్వంలో రమణ కమ్యూనికేషన్ పతాకంపై తెరకెక్కించిన చిత్రం తిరుక్కురళ్. ఇందులో తిరువళ్లువర్గా కలైచోళన్, వాసుకిగా ధనలక్ష్మీ నటించారు. ఇళయరాజా సంగీతం అందించిన ఈ చిత్రం ఈనెల 27న తెరపైకి రానుంది. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ల్యాబ్లో జరిగింది. దర్శక నిర్మాత ఏజే.బాలకృష్ణన్ మాట్లాడుతూ ఒక చెత్త కథనంతో మంచి చిత్రాన్ని చేయలేమని కురోచోవా చెప్పారన్నారు. చిత్ర నిర్మాణానికి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు పడలేదన్నారు. విడుదలై చిరుతైగళ్ పార్టీ నేత తోల్ తిరుమావళవన్ మాట్లాడుతూ తిరుక్కురల్ను తెరపై ఆవిష్కరించడాన్ని అభినందిస్తున్నానన్నారు. ఇకపోతే ఇటీవల కమలహాసన్ చెప్పిన తమిళం నుంచే కన్నడ భాష ఉద్భవించిందన్న విషయాన్ని కన్నడిగులు వ్యతిరేకిస్తున్నారని, అయితే 1812లో బ్రిటీష్ పాలనలోనే ఎల్వీస్, 1852లో హెన్రీ హయసింగ్టన్ అనే బ్రిటీష్ పౌరులు తమిళ భాషపై పరిశోధనలు చేశారన్నారు. దక్షిణ భాషల్లో ప్రధాన భాష తమిళం అని నిర్ధారించారన్నారు. కాగా తిరువళ్లువర్ రాసిన సూక్తులతో రూపొందిన తిరుక్కురళ్ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా అందరూ చూడాల్సిన చిత్రం అని చెప్పారు.
తిరుక్కురల్ ఆడియోను ఆవిష్కరిస్తున్న తోల్ తిరుమావళవన్తో యూనిట్ సభ్యులు