
పరమశివన్ ఫాతిమకు ప్రశంసలు
తమిళసినిమా: నటుడు విమల్, ఛాయాదేవి జంటగా నటించిన చిత్రం పరమశివన్ ఫాతిమ. ఎంఎస్.భాస్కర్, మనోజ్కుమార్, శ్రీరంజని, ఆదిరా, అరుల్దాస్, కాదల్ సుకుమార్, కూల్ సురేష్, వీరసమరన్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం ద్వారా చాయాగ్రహకుడు సుకుమార్ ప్రతినాయకుడిగా పరిచయం అయ్యారు. లక్ష్మీ క్రియేషన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి ఇసక్కీ కార్వనన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. ఇది మూడు మతాల ప్రజల మనోభావాలను ఆవిష్కరించే కథాంఽశంతో రూపొందింది. హిందువులు, క్రిష్టియన్లు, ఇస్లామిన్లు మధ్య జరిగే పోరాటాల నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో హిందువులు, క్రిష్టయన్ల వీధుల్లో జరిగే పెళ్లిళ్ల సమయంలో పెళ్లి కొడుకులు అకస్మాత్తుగా అదృశ్యమై ఆ తరువాత హత్యకు గురవుతారు. ఈ హత్యలకు కారణం ఏమిటన్నది ఛేదించడానికి పోలీసులు రంగప్రవేశం చేస్తారు. అయితే ఈ కేసులు పోలీసులకే సవాల్గా మారతాయి. ఈ హత్యలు ఎవరు చేస్తున్నారు? అందుకు కారణం ఏమిటీ? పోలీసులు విచారణలో తేలిన విస్మయం చెందే సంఘటనలు ఏమిటి వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందిన చిత్రం పరమశివన్ ఫాతిమ. ఇందులో విమల్, ఛాయాదేవి వేర్వేరు మతాలకు చెందిన ప్రేమికులుగా నటించారు. వారి ప్రేమకు మతాలు ఆటంకంగా మారుతాయి. మరి వారి ప్రేమ సుఖాంతం అయ్యిందా లేదా అన్నదే ఈ చిత్రం. ఈచిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. ఈ చిత్రాన్ని చూసిన నామ్ తమిళర్ పార్టీ నేత సీమాన్ మంచి కథా చిత్రంగా ప్రశంసించారు. దర్శకుడు ఇసక్కీ కార్వనన్కు అభినందనలు తెలిపారు.