
విద్యా ఉపకరణాల పంపిణీ
తిరువళ్లూరు: తిరునిండ్రవూర్ సమీపం కసువ గ్రామంలోని సేవాలయ విద్యాసంస్థలో చదువుతున్న 2,200 మంది విద్యార్థులకు విద్యా ఉపకరణాలను ఉచితంగా రిటైర్డ్ న్యాయమూర్తి పీఎన్. ప్రకాష్ అందజేశారు. తిరువళ్లూరు జిల్లా కసువ గ్రామంలో సేవాలయ స్వచ్ఛంద సంస్థ వుంది. సంస్థలో రెండు వేలకు పైగా విద్యార్థులకు ఉచితంగా విద్యను గత 35 సంవత్సరాలుగా అందిస్తున్నారు. ప్రతి ఏటా విద్యా సంవత్సరం ప్రారంభంలోనే సేవాలయ సంస్థలో చదువుతున్న విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు, బ్యాగుతో పాటు ఇతర ఉపకరణాలను ఉచితంగా అందజేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది పాఠశాలలోని 2,200 మందికి ఉచిత విద్యా ఉపకరణాలను అందజేసే కార్యక్రమం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మురళీధరన్ శుక్రవారం ఉదయం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ప్రకాష్ హాజరై ఉపకరణాలను అందజేశారు. ఆయన మాట్లాడుతూ సేవాలయంలోని విద్యార్థులకు తమ వంతు సహకారాన్ని అందించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇక్కడికి వచ్చిన ప్రతిసారీ ఆలయానికి వచ్చినట్టు సంతృప్తి కలుగుతుందని తెలియజేశారు. విద్యార్థులకు సేవ చేయడం ఆత్మసంతృప్తిని కలిగిస్తుందన్నారు. సేవాలయంలోని ఉపాధ్యాయులు సేవాభావంతో పనిచేయాలని సూచించారు. అబ్దుల్కలాం ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులు ఉన్నత స్థితికి రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సేవాలయ ట్రస్టీలు అమిత్చంద్జైన్, అన్నపూర్ణ, కింగ్స్టన్ తదితరులు పాల్గొన్నారు.