
ఫుడ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు
తిరుత్తణి: తిరుత్తణిలోని దుకాణాల్లో ఫుడ్ కంట్రోల్ ఆఫీసర్లు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నాణ్యత లోపించిన ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుని నాశనం చేశారు. ఆధ్యాత్మిక పట్టణం తిరుత్తణికి ప్రతిరోజూ వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు, ప్రయాణికులు వస్తుంటారు. భక్తులు, ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని హోటళ్లు, టీ దుకాణాలు, పండ్లు, సహా ఇతర ఆహార వస్తువుల దుకాణాల్లో నాణ్యత లోపించిన వస్తువులు విక్రయిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదులతో జిల్లా కలెక్టర్ ప్రతాప్ ఆదేశాల మేరకు ఫుడ్ కంట్రోల్ అధికారుల బృందం తనిఖీలు చేపట్టింది. అధికారి దుర్గాదేవి ఆధ్వర్యంలోని బృందం తిరుత్తణి బస్టాండు, సన్నిధి వీధి, అరక్కోణం రోడ్డు మార్గాల్లోని హోటళ్లు, టీ దుకాణాలు, ఫాస్ట్ఫుడ్ దుకాణాలు, కూల్డ్రింక్స్, పండ్లు దుకాణాల్లో తనిఖీ చేపట్టారు.
ఈ సందర్భంగా మాంసంలో రసాయనాల మిశ్రమం, ఫాస్ట్ఫుడ్లో రంగులు, కూల్ డ్రింక్స్లో ప్రమాదకరమైన రసాయనాలు కలపినట్లు, టీ పొడి నాణ్యత లేక పోవడం, మందులతో పండ్లు పండించినట్లు గుర్తించారు. దాదాపు పది కేజీల మాంసం, ఫాస్ట్ఫుడ్, పండ్లు స్వాధీనం చేసుకుని నాశనం చేశారు. ఆహారం ఉత్పత్తుల్లో నాణ్యత లోపించడంపై ఫుడ్ కంట్రోల్ నెంబర్ 9444042322లో ఫిర్యాదు చేయాలని కోరారు.