
మదురై లేదా కన్యాకుమారి నుంచి ప్రజా పయనం
– విజయ్ పరిశీలన
సాక్షి, చైన్నె: జూలై మొదటి వారం నుంచి విజయ్ పూర్తి స్థాయి రాజకీయాలపై దృష్టి సారించనున్నారు. ఆయన తొలి బహిరంగ సభకు వేదికగా మదురై లేదా కన్యాకుమారిని పరిశీలిస్తున్నారు. విజయ్ ప్రజల్లోకి తమిళగ వెట్రి కళగంను విస్తృతంగా తీసుకెళ్లిన విషయం తెలిసిందే. బూత్ కమిటీల నుంచి రాష్ట్ర స్థాయి కమిటీల ఏర్పాటు ప్రక్రియ వరకు అన్ని ముగించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్ తరచూ పార్టీ జిల్లాల కార్యదర్శులతో సమావేశం అవుతూ వస్తున్నారు. ముఖ్య నిర్వాహకులను పిలిపించి సూచనలు ఇస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితులలో విజయ్ బర్త్డే ఈనెల 22న రాష్ట్ర వ్యాప్తంగా సేవల రూపంలో నిర్వహించేందుకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. అదే సమయంలో జూలై మొదటి వారం నుంచి విజయ్ పూర్తి స్థాయి రాజకీయ నేతగా మారనున్న దృష్ట్యా, ఆయన తొలి పర్యటనకు వేదికగా మదురై లేదా కన్యాకుమారిని ఎంపిక చేసే పనిలో భుస్సీ ఆనంద్ నిమగ్నమయ్యారు. ఇక్కడ జరిగే బహిరంగ సభ అనంతరం విజయ్ ప్రజల్లోకి నియోజకవర్గాల బాట పట్టనున్నారు. ఈ పరిస్థితులలో శుక్రవారం కన్యాకుమారిలో పర్యటించిన భుస్సీ ఆనంద్ వేదిక ఎంపికపై కసరత్తులో నిమగ్నమయ్యారు. శనివారం మదురైలో పర్యటించినానంతరం వేదికను ఖరారు చేయబోతున్నారు. విజయ్ తన బర్త్డే రోజున రాజకీయ కార్యాచరణ, నియోజకవర్గ బాట, ప్రజాక్షేత్ర పర్యటన వివరాలను వెల్లడించే అవకాశాలున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. దీనికి మరింత బలాన్ని చేకూర్చే విధంగా విజయ్కు మద్దతుగా సామాజిక మాధ్యమాల వేదికగా ప్రచారాన్ని విస్తృతం చేయడానికి నిర్వాహకులు రెడీ అయ్యారు.