
మత్తు రహితంగా తీర్చిదిద్దాలి
వేలూరు: యువతతోపాటు విద్యార్థులు మత్తుకు బానిసలు కాకుండా దూరంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సుబ్బలక్ష్మి అన్నారు. వేలూరు జిల్లా కాట్పాడిలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో మత్తుకు దూరంగా ఉండడంతపై అవగాహన, విద్యార్థులతో ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశంలోని యువత అధిక భాగం మత్తు పదార్థాలకు బానిసలు అవుతున్నార ని వాటి నుంచి బయట పడాలన్నారు. ప్రస్తుతం పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోని యువకులే అధికంగా మత్తుకు బానిసలవుతున్నారన్నారు. ఒకసారి మత్తు పదార్థాలను వాడడంతో తరచూ వాడాలనిపిస్తుందని, వాటికి ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలన్నారు. మత్తుకు యువత బాని స కాకుండా ఉండేందుకు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వేలూరు కార్పొరేషన్లోని అన్ని వార్డుల్లో మత్తు పదార్థాలను విక్రయించకూడదని, ఇప్పటికే అన్ని దుకాణాలకు, గోడౌన్ యజమానుల కు జిల్లా యంత్రాంగం నోటీసులు జారీ చేసిందదన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు తదితర 234 పాఠశాలల్లో ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో విద్యాశాఖ సీఈఓ దయాళన్, విద్యార్థులు, టీచర్లు పాల్గొన్నారు.