
కార్పొరేషన్ పాఠశాలల అభివృద్ధికి చర్యలు
వేలూరు: వేలూరు కార్పొరేషన్లోని పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కార్తికేయన్ అన్నారు. వేలూరు కార్పొరేషన్ పరిధిలోని మకాన్ వద్ద ఉన్న అంబేడ్కర్ నగర్లోని కార్పొరేషన్ పాఠశాలలో అదనపు గదులను ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి, ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ కార్పొరేషన్లోని అన్ని పాఠశాలలకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. అదే విధంగా ఇప్పటికే పలు పాఠశాలల్లో అదనపు గదులు అవసరమని తమ దృష్టికి తీసుకొచ్చారని వీటిపై ప్రత్యేక నిధులు కేటాయించి నిర్మిస్తామన్నారు. అదే విధంగా పాఠశాలలకు తాగునీటి సదుపాయం, మరుగుదొడ్ల సదుపాయాన్ని కల్పిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ విద్యావేత్తలు కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ సుజాత, కార్పొరేటర్ కాంచన క్రిష్ణమూర్తి, మాజీ కార్పొరేటర్ దురై అరసన్, కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు.