
మెట్రో–2 కోసం డ్రైవర్ రహిత రైళ్లు
● రూ.1,538 కోట్లతో ఒప్పందాలు
సాక్షి, చైన్నె: మెట్రో ఫేజ్–2 కోసం 32 డ్రైవర్ రహిత రైళ్లను కొనుగోలు చేయడానికి చైన్నె మెట్రో యాజమాన్యం చర్యలు తీసుకుంది. గురువారం రూ.1,538 కోట్లతో ఒప్పందాలు జరిగాయి.చైన్నెలో ఫేజ్–1 పనులు ముగియడంతో విమానాశ్రయం నుంచి కోయంబేడు మీదుగా సెంట్రల్కు, సెయింట్థామస్ మౌంట్–ఆలందూరు–సెంట్రల్ మీదుగా విమ్కోనగర్కు మెట్రోరైలు సేవలు జరుగుతున్నాయి. ఈ సేవలకు అమిత స్పందన రావడంతో ఫేజ్–2లో మరోమూడు మార్గాలుగా మాధవరం–సిరుచ్చేరి, మాధవరం– షోళింగనల్లూరు, పూందమల్లి– లైట్ హౌస్లను ఎంపిక చేసి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఈమార్గంలో డ్రైవర్ రహిత మెట్రో రైలు నడిపేందుకు అధికారులు కసరత్తులు చేపట్టారు. ఇందులో భాగంగా తమిళనాడు సరిహద్దుల్లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిధిలో ఉన్న శ్రీసిటీ నుంచి మూడు బోగీలతో కూడిన రెండు డ్రైవర్ రహిత మెట్రో రైళ్లు చైన్నె పూందమల్లి వర్క్షాపునకు ఇప్పటికే చేరాయి. పూందమల్లి నుంచి పోరూర్ వరకు 9కి.మీ దూరం మెట్రో పనులు ముగియడంతో ఈమార్గంలో డ్రైవర్ రహిత మెట్రో ట్రయల్ రన్ జరుగుతోంది.
32 రైళ్లకు ఒప్పందాలు
ఫేజ్–2 ప్రాజెక్ట్ కింద డ్రైవర్ రహిత మెట్రో రైలు మూడు బోగీలను కలిగి ఉంటుంది. 32 మెట్రో రైళ్ల తయారీకి చైన్నె మెట్రో రైల్ కార్పొరేషన్ ఆల్ స్టోమ్ ట్రాన్న్స్పోర్ట్ ఇండియాకు రూ.1,538.35 కోట్ల విలువైన కాంట్రాక్టును అప్పగించింది. ఈ ఒప్పందంపై చైన్నె మెట్రోరైల్ కార్పొరేషన్ డైరెక్టర్ (సిస్టమ్స్ అండ్ ఆపరేషన్న్స్) మనోజ్ గోయల్, ఆల్స్టోమ్ ట్రాన్స్పోర్ట్ ఇండియా కార్పొరేషన్ డైరెక్టర్ పరాగ్ నందలాల్ గోయల్ గురువారం సంతకం చేశారు. ఈ ఒప్పందం ప్రకారం, 2027లో చైన్నె మెట్రోరైలు కార్పొరేషన్న్కు ఈ సంస్థ తొలి రైలును అప్పగించనుంది. అన్ని మెట్రోరైళ్లను సెప్టెంబర్ 2027 నుంచి మే 2028 వరకు దశల వారీగా చైన్నె మెట్రోరైల్ కార్పొరేషన్న్కు అప్పగించనున్నారు.