
ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలి
వేలూరు: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటేందుకు ముందుకు రావాలని కలెక్టర్ సుబ్బలక్ష్మి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురష్కరించుకుని గురువారం వేలూరు జిల్లా అనకట్టు నియోజకవర్గం పరిధిలోని పుత్తూరు గ్రామ పంచాయతీలోని పలు ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చెట్లును నాటడంతో పాఠశాలకు వచ్చే విద్యార్థులకు ఆరోగ్యమైన గాలి పీల్చేందుకు అవకాశం ఉందన్నారు. వీటిని జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. అలాగే విద్యార్థులందరూ విధిగా ఒక మొక్కను నాటాలనే ప్రతిజ్ఞ చేయించడం జరుగుతుందన్నారు. పాఠశాలల్లోని ఉపాధ్యాయులందరూ మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న వాగులు, వంకలతో పాటు రోడ్డుకిరువైపులా మొక్కలు నాటడంతో రానున్న తరానికి ఆరోగ్య కరమైన గాలిని పీల్చేందుకు అవకాశం ఉంటుందన్నారు. వీటికి అటవీశాఖ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు సంయుక్తంగా కంకణం కట్టుకోవాలన్నారు. అటవీశాఖలో ఒక చెట్టు కూలితే పది మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నందకుమార్, జెడ్పీ చైర్మన్ బాబు, యూనియన్ చైర్మన్ భాస్కరన్, అటవీ, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. అనంతరం కాట్పాడి నియోజక వర్గంలోని సేవూరు గ్రామ పంచాయతీలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు.