
వ్యర్థాల రీసైక్లింగ్పై అధ్యయనం
● అధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష
సాక్షి, చైన్నె : వివిధ వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడానికి, విడిగా సేకరణ పనులపై జిల్లా అధికారులతో గురువారం డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సమీక్షించారు. ఆయా పనులు, పరిశోధనలను వీడియో కాన్పరెన్స్ ద్వారా అధ్యయనం చేశారు. తీవ్ర జ్వరంతో విశ్రాంతిలో ఉన్న డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ గురువారం చైన్నె కార్పొరేషన్ భవనం రిప్పన్ బిల్డింగ్కు వచ్చారు. అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. స్వచ్ఛ తమిళనాడులో మొదటి అడుగుగా సచివాలయంతో సహా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలను శుభ్రం చేయడానికి చర్యలు చేపట్టారు. ప్లాస్టిక్ వ్యర్థాలు, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, లోహ వ్యర్థాలు, కాగితపు వ్యర్థాలు, గాజు వ్యర్థాలు, ఉపయోగించలేని కలప, లాజిస్టిక్స్ వంటి వివిధ రకాల వ్యర్థాలను సేకరించి, రీసైక్లింగ్ దిశగా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. రీసైక్లింగ్ కోసం ప్రత్యేక సేకరణ వంటి అంశాలతో తీర్చిదిద్దిన వీడియోను వీక్షించారు. స్వచ్ఛ తమిళనాడు నినాదంతో స్వచ్ఛమిషన్ ప్రాజెక్టును ప్రారంభించిన విషయాన్ని ఈ సందర్భంగా ఉదయ నిధి స్టాలిన్ ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టులో మొదటి అడుగుగా రాష్ట్రంలోని 38 జిల్లాల కలెక్టర్లు, ఇతర కార్యాలయాలు, సుమారు1,100 ప్రభుత్వ కార్యాలయాల్లో చేపట్టాల్సిన పనులను వివరించారు. ఈ సమావేశంలో గ్రేటర్ చైన్నె మేయర్ ఆర్. ప్రియ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మురుగానందం, అదనపు ముఖ్య కార్యదర్శి, ప్రదీప్ యాదవ్, డిప్యూటీ మేయర్ ఎం. మహేష్కుమార్,తదితరులు పాల్గొన్నారు.