
మృతదేహం బంధువులకు అప్పగింత
తిరువళ్లూరు: మార్చురీలో ఉంచిన వృద్దుడి మృతదేహం మాయమైన వ్యవహరంలో పోలీసులు ప్రత్యేక చొరవ తీసుకుని బిహార్కు తీసుకెళ్లిన మృతదేహాన్ని వెనక్కి తీసుకువచ్చి, బంధువులకు అప్పగిచడంతో కథ సుఖాంతమైంది. తిరువళ్లూరు జిల్లా బుజ్జిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ రాజేంద్రన్(61) తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందగా మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం తిరువళ్లూరు మార్చురీలో ఉంచారు. అయితే మార్చురీలో ఉంచిన మృతదేహం బుధవారం హఠాత్తుగా మాయమైంది. పోలీసుల విచారణలో అనారోగ్యంతో మృతి చెందిన బిహార్కు చెందిన వ్యక్తిగా భావించి రాజేంద్రన్ మృతదేహాన్ని బిహార్కు తరలించారు. రాజేంద్రన్ బంధువులకు బిహార్కు చెందిన వ్యక్తి మృతదేహాన్ని అప్పగించి తీసుకెళ్లాలని వైద్యశాల సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. దీంతో బంధువుల ఆందోళనకు దిగారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి బిహార్కు మృతదేహాన్ని తీసుకెళుతున్న ఆంబులెన్స్ డ్రైవర్ను ఫోన్లో సంప్రదించారు. విషయాన్ని వివరించి మృతదేహాన్ని వెనక్కి తీసుకుని రావాలని ఆదేశించారు. దీంతో మృతదేహం గురువారం మధ్యాహ్నం తిరువళ్లూరుకు చేరింది. అనంతరం రాజేంద్రన్ కుటుంబ సభ్యులను పిలిపించి, మృతదేహాన్ని అప్పగించడానికి యత్నించారు. అయితే రాజేంద్రన్ బంధువుల మృతదేహాన్ని తీసుకోవడానికి నిరాకరించి గురువారం ఆందోళన చేపట్టారు. మృతదేహాన్ని చూడకుండా నిర్లక్ష్యంగా బిహార్కు పంపిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఆందోళనకారులతో చర్చించి వారిని సముదాయించి మృతదేహాన్ని అప్పగించారు.