
బ్రిడ్జి నిర్మాణానికి భూమి పూజ
తిరుత్తణి: తిరుత్తణి–పొదటూరుపేట రాష్ట్ర రహదారిలో నంది నదిలో వరద ప్రవాహం సందర్భంగా రాకపోకలకు ఇబ్బందులు పరిష్కరించే విధంగా రూ.7.40 కోట్లతో హైవే బ్రిడ్జి నిర్మాణానికి గురువారం భూమి పూజతో పనులు ప్రారంభమయ్యాయి. తిరుత్తణి నుంచి పొదటూరుపేటకు వెళ్లే రాష్ట్ర రహదారిలో తెక్కళూరు వద్ద నంది నది ప్రవహిస్తుంది. వర్షాకాలంలో వరద నీటి ప్రవాహంతో రాకపోకలు స్తంభించి 60 గ్రామాల ప్రజలు ఇబ్బందులు చెందేవారు. నంది నదిపై బ్రిడ్జి నిర్మించాలని గ్రామీణులు కోరుతున్నారు. ఈక్రమంలో జాతీయ రోడ్ల అభివృద్ధి నిధుల పథకం ద్వారా రూ.7.40 కోట్లు కేటాయించి హైవే బ్రిడ్జి నిర్మాణ పనులు గురువారం ప్రారంభమయ్యాయి. తిరుత్తణి ఎమ్మెల్యే చంద్రన్ పాల్గొని భూమిపూజ చేశారు. తిరుత్తణి మండల కార్యదర్శి కృష్ణన్ పాల్గొన్నారు.